
హైదరాబాద్: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయనున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత రాయుడు రాజకీయాల్లోకి రానున్నాడు. గుంటూరులో పుట్టిన అంబటి ఆ రాష్ట్ర ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. ‘రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నా. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నా. కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతా. ఏ పార్టీలో చేరాలన్నది కూడా అప్పుడే తెలుస్తుంది’ అని రాయుడు చెప్పాడు. హైదరాబాద్లో క్రికెటర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశాడు. ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
బీఆర్ఎస్ నుంచి ఆఫర్!
విశ్వసనీయ సమాచారం మేరకు బీఆర్ఎస్ ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్.. అంబటిని తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. సిద్దిపేట సమీపంలో వ్యవసాయ భూమి ఉన్న రాయుడికి మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్తో మంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో అతను బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందన్న అభిప్రాయాలున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటిదాకా తనతో నేరుగా ఏ పార్టీగానీ, నేత గానీ మాట్లాడలేదని రాయుడు చెప్పాడు. తన నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తానన్నాడు. ఏదేమైనా తన ఆటతో పాటు పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన రాయుడు రాజకీయాల్లోకి రానుండటం ఆసక్తికరంగా మారింది.