రక్తం దొరకట్లే .. మంచిర్యాల రెడ్​క్రాస్​ బ్లడ్​బ్యాంక్​లో కొరత

రక్తం దొరకట్లే .. మంచిర్యాల రెడ్​క్రాస్​ బ్లడ్​బ్యాంక్​లో కొరత
  • తలసేమియా, సికిల్​సెల్​ బాధితుల అవస్థలు 
  • నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం
  • అందుబాటులో ఉన్నవి 195 మాత్రమే
  • నెగెటివ్ గ్రూపుల బ్లడ్​ కోసం తీవ్ర ఇబ్బందులు 
  • బ్లడ్​ డొనేషన్​కు ముందుకు రావాలని వేడుకోలు

మంచిర్యాల, వెలుగు: తలసేమియా, సికిల్​సెల్​ బాధితులు, యాక్సిడెంట్లలో గాయపడ్డవారు, డయాలసిస్​ పేషెంట్లు, గర్భిణులు, బాలింతలకు ఎమర్జెన్సీ టైమ్​లో రక్తం అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొన్నది. మంచిర్యాల గవర్నమెంట్​జనరల్ ​హాస్పిటల్​(జీజీహెచ్)లోని ఇండియన్ ​రెడ్​క్రాస్(ఐఆర్ సీఎస్) బ్లడ్​ బ్యాంక్​లో రక్త నిల్వలు నిండుకుంటున్నాయి. పాజిటివ్ ​గ్రూప్​ రక్తం అరకొరగా అందుబాటులో ఉన్నప్పటికీ.. నెగెటివ్​ గ్రూప్​ బ్లడ్​కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రస్తుతం అన్ని రకాలు కలిపి195 యూనిట్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇవి కూడా నాలుగైదు రోజులకే సరిపోనున్నాయి. ఇటీవల బ్లడ్​ డొనేషన్​ క్యాంపులు లేకపోవడం, స్వచ్ఛంద రక్తదాతలు సైతం ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని బ్లడ్ ​బ్యాంక్​ నిర్వాహకులు 
పేర్కొంటున్నారు. 

నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం

రెడ్​క్రాస్ ​బ్లడ్​ బ్యాంక్​ ద్వారా తలసేమియా, సికిల్​సెల్​బాధిత పిల్లలతో పాటు గవర్నమెంట్​ హాస్పిటల్​కు వచ్చే పేషెంట్లు, ఎంసీహెచ్​లో చికిత్స పొందుతున్న గర్బిణులు, బాలింతలు, డయాలసిస్​ పేషెంట్లకు అవసరమైన రక్తాన్ని ఫ్రీగా అందజేస్తున్నారు. వీరికి రోజుకు 30 నుంచి 40 యూనిట్ల చొప్పున నెలకు వెయ్యి యూనిట్లకు పైగా వివిధ గ్రూపుల బ్లడ్​అవసరం అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్​తో పాటు పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 2వేల మంది తలసేమియా, సికిల్ సెల్​ బాధితులున్నారు. ఇందులో 832 మందికి మంచిర్యాల బ్లడ్​బ్యాంక్ ద్వారా రక్తం అందిస్తున్నారు. తలసేమియా బాధితులకు నెలకు రెండుసార్లు, సికిల్​సెల్ ​వారికి మూడు నెలలకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. వీరికి టైమ్​కు రక్తం అందుబాటులో లేకపోవంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రైవేట్​ బ్లడ్​ బ్యాంకుల్లో రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు

ప్రైవేట్​బ్లడ్​ బ్యాంకుల్లో ఒక్కసారి రక్తం ఎక్కించుకోవాలంటే రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చవుతుంది. అసలే పేద కుటుంబాలు కావడంతో ఆర్థిక స్తోమత లేక బాధితులు అవస్థలు పడుతున్నారు. అలాగే జీజీహెచ్​కు వచ్చే యాక్సిడెంట్​బాధితులు, డయాలసిస్ ​పేషెంట్లు, ఎంసీహెచ్​లోని పేషెంట్లకు ఎమర్జెన్సీగా రక్తం అవసరమైతే ప్రైవేట్​బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్కడ కూడా పేషెంట్ల తరఫున డోనర్స్​ బ్లడ్​ డొనేట్​ చేస్తేనే వారికి అవసరమైన రక్తం అందిస్తున్నారు. 

డొనేషన్​కోసం విజ్ఞప్తులు 

సాధారణంగా విద్యాసంస్థలు, ఎన్​జీవోలు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో బ్లడ్​ డొనేషన్ క్యాంపులు నిర్వహించి రక్తం సేకరిస్తుంటారు. ప్రస్తుతం 
ఎగ్జామ్స్​ సీజన్​ కావడంతో విద్యాసంస్థలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఎండలు ముదరడం వల్ల ఆయా సంఘాలు, యూనియన్లు సైతం క్యాంపుల 
నిర్వహణకు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ఎమర్జెన్సీ టైమ్​లో స్వచ్ఛంద రక్తదాతలు కరుణించి ఒకటి రెండు యూనిట్లు ఇస్తే వాటిని పేషెంట్లకు అందిస్తు న్నారు. ఈక్రమంలో ఎన్​జీవోలు, వివిధ యూనియన్లు స్పందించి బ్లడ్​ డొనేషన్​ క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

మంచిర్యాల రెడ్​క్రాస్ బ్లడ్​ బ్యాంక్​ ద్వారా తలసేమియా, సికిల్ సెల్​ బాధితులకు ఉచితంగా రక్తం అందిస్తున్నాం. ప్రస్తుతం రక్త నిల్వలు నిండుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా కలెక్టర్, డీసీపీ, సింగరేణి ఉన్నతాధికారులు, ఎన్​జీవోలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్పందించి బ్లడ్​ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా బాధిత చిన్నారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నాం. 

 కాసర్ల శ్రీనివాస్, స్టేట్​వైస్​ ప్రెసిడెంట్, తలసేమియా వెల్ఫేర్ ​సొసైటీ​