
బెల్లంపల్లిలో టీఆర్ఎస్ లీడర్ల తీరుపై విమర్శలు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల శుభాకాంక్షలు తెలిపే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలను బెల్లంపల్లి మునిసిపల్ సిబ్బంది పలు కూడళ్లలో, ప్రధాన రహదారి డివైడర్పై కట్టారు. మున్సిపల్ పాలకవర్గం ఆదేశాలతో బుధవారం ఉదయం 5 గంటల నుంచే మున్సిపల్ సిబ్బంది ట్రాలీలో ఫ్లెక్సీలను వేసుకొని టౌన్లోని ఏఎంసీ నంబర్ 2 క్రీడా మైదానం మెయిన్రోడ్డు నుంచి మెయిన్ బజార్, కాంటా చౌరస్తా, పాత బస్టాండ్, కన్నాల ఫ్లైఓవర్ వరకు ఫ్లెక్సీలు కట్టారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు, ఇతర పనులు చేయాల్సిన సిబ్బందితో ఫ్లెక్సీలు కట్టించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ పెద్దలు మున్సిపల్పనులు చేయనీయకుండా కార్యకర్తల్లా సిబ్బందిని వాడుకుంటున్నారని పలువురు మండిపడ్డారు.
సిబ్బందిని మందలించాం
ఫ్లెక్సీలు కట్టిన విషయమై మున్సిపల్ సిబ్బందిని మందలించాం. ఫ్లెక్సీలు కట్టిన విషయం నాకు తెలియదు. విషయం తెలియ గానే సిబ్బందితో మాట్లాడాను. మరోసారి ఇలాంటివి చేయకూడదని హెచ్చరించి, ఇతర పనులకు సిబ్బందిని పంపించాను. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఎవరూ అనుమతులు తీసుకోలేదు. ‑ జంపాల రజిత, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్