
నారాయణపేట, వెలుగు : నారాయణపేటలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడడంతో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. నారాయణపేట–హైదరాబాద్ మెయిన్ రోడ్డులోని డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అగ్రికల్చర్ మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు వర్షానికి తడిసిపోయాయి.
గండీడ్: మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డి గ్రామంలోని ఐకేపీ కొనుగోలుసెంటర్ లో వడ్లు తడిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వడ్లు మొత్తం నానిపోయాయి. రైతులు టార్పాలిన్లు, కవర్లు కప్పేలోపే వడ్లన్నీ తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేవల్లి: ఈదురుగాలులతో మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన దొడ్డి జానీకి చెందిన ఐదెకరాల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.