అకాల వర్షం.. తడిచిన ధాన్యం

అకాల వర్షం.. తడిచిన ధాన్యం
  • ఈ నెలలో కురిసిన వానలకు జిల్లాలో 1800 ఎకరాల్లో పంట నష్టం

యాదాద్రి, చౌటుప్పల్​, యాదగిరిగుట్ట, వెలుగు : అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచంపల్లి, రామన్నపేట, బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిచిపోయాయి. వరద నీటిలో కొట్టుకుపోయిన వడ్లను ఒకచోటకు చేర్చడానికి రైతులు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు ఐదుసార్లు వడగండ్లతో కూడిన వర్షాలు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. 

పొలాలు తడవడంతో వరి కోతల పనులు ముందుకు సాగడం లేదు. మామిడి రైతులకు నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నెలలో తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, మోటకొండూరు, బీబీనగర్, భూదాన్​ పోచంపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి మొత్తంగా 1300 రైతులకు చెందిన 1800 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో 250 ఎకరాల్లో మామిడి, మిగిలిన 1550 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన రైతులు నష్టపోయారు.