
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి బ్యారేజీ తెలంగాణకు వాటర్ హబ్గా మారింది. ఇక్కడి నుంచే మిడ్ మానేరు మొదలు మల్లన్నసాగర్ వరకు రివర్స్ పంపింగ్ జరిగేది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు తలెత్తడం వల్ల రివర్స్ పంపింగ్ నిలిచిపోయింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం నీటి కటకట ఎదురైంది. గోదావరికి ఎగువ ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇన్ఫ్లో పూర్తిగా బంద్ అయ్యింది.
కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లిలో 20 టీఎంసీల గరిష్ట సామర్థ్యం మెయింటెయిన్చేశారు. ఈ ఏడాది రివర్స్ పంపింగ్ చేసే అవకాశం లేదు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చని, ఈ ఎండాకాలం గడవడం కూడా కష్టమేనని అధికారులు చెబుతున్నారు.
గూడెం లిఫ్ట్ కింద ఎండుతున్న పంటలు
కడెం ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏర్పాటు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేసి దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం. ప్రాజెక్టులో 18 టీఎంసీలు ఉంటేనే లిఫ్ట్లు నడపాలనే ఆదేశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో వాటర్ లెవల్స్ అంతకంటే తగ్గడంతో ఆందోళన మొదలైంది.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఉన్నతాధికారులపై ఒత్తిడి తేగా, యాసంగి సీజన్లో15వేల ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీళ్లు ఇస్తామన్నారు. ఈ మేరకు జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వాటర్ సప్లై చేసి, రెండు రోజుల కిందట లిఫ్ట్ బంద్ చేశారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నది. ఈ సమయంలో లిఫ్ట్ బంద్ కావడంతో పొలాలు ఎండుతున్నాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు మరో తడిని అందించాలని కోరుతున్నారు.