
- 12 నియోజకవర్గాల్లో 346 మంది క్యాండిడేట్లు, 539 నామినేషన్లు
- 13న స్క్రూట్నీ, 15 వరకు ఉపసంహరణ
వరంగల్/హనుమకొండ/జనగామ/ములుగు/మహబూబాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్లు శుక్రవారంతో ముగిశాయి. ఇప్పటికే నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల క్యాండిడేట్లు శుక్రవారం మరో సెట్ నామినేషన్లు వేయగా, ఇతర పార్టీల నేతలు, ఇండిపెండెంట్లు సైతం భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 346 మంది క్యాండిడేట్లు 539 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 13వ తేదీన స్క్రూట్నీ నిర్వహించనుండగా, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనుంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ర్యాలీ నిర్వహించిన అనంతరం మరోసారి నామినేషన్ వేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చివరిరోజు 24 మంది నామినేషన్లు వేయగా మొత్తం 55 వచ్చాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఒక్కరోజే నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. పరకాల నియోజకవర్గానికి శుక్రవారం 34 సెట్ల నామినేషన్లు వచ్చాయి.
వర్ధన్నపేటలో కాంగ్రెస్ తరపున ఇప్పటికే కేఆర్.నాగరాజు నామినేషన్ వేయగా, చివరి రోజున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య సైతం నామినేషన్ వేశారు. ఆయన తరఫున ప్రొఫెసర్ వేణుగోపాల్ నామినేషన్ పేపర్స్ను అందజేశారు. జనగామ నియోకవర్గంలో శుక్రవారం 19 మంది 35 సెట్లు, స్టేషన్ఘన్పూర్లో 15 మంది 25 సెట్లు, పాలకుర్తిలో 24 మంది 41 సెట్ల నామినేషన్లు వేశారు. ములుగులో శుక్రవారం ఒక్కరోజే 19 నామినేషన్లు వచ్చాయి