గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
  • వీసీలో పాల్గొన్న కలెక్టర్లు, ఎస్పీలు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సీఎస్​ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. గురువారం సెక్రటేరియెట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు.

పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్​గా నియమించినకట్టు పేర్కొన్నారు. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్​ను కూడా నియమించినట్టు వివరించారు. బయోమెట్రిక్ సమస్యలు తలెత్తకుండా తగిన సంఖ్యలో బయోమెట్రిక్ పరికరాలను కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లకు కూడా పరీక్షల ఏర్పాట్లపై తగిన ఆదేశాలు జారీ చేశామని, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి కూడా శిక్షణ పూర్తయిందని సీఎస్ స్పష్టం చేశారు.

గ్రూప్‌‌-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లావ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. ఇదే సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్‌‌ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లోని స్కూళ్లకు యూనిఫాంల పంపిణీ వంటి అంశాలను కూడా సీఎస్‌‌ ప్రస్తావించారు. బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రాబోయే మూడు వారాల పాటు ఇదే విధంగా నిఘా కొనసాగించాలని కోరారు.