
- రాణించిన రాహుల్, పోరెల్, స్టబ్స్
- విజయ్ శంకర్, ధోనీ పోరాటం వృథా
చెన్నై: ఆల్రౌండ్తో షోతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 15 ఏండ్ల తర్వాత చెన్నై సూపర్కింగ్స్ను వాళ్ల సొంతగడ్డపై ఓడించింది. కేఎల్ రాహుల్ (51 బాల్స్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77), అభిషేక్ పోరెల్ (20 బాల్స్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 33) రాణించడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 25 రన్స్ తేడాతో చెన్నైకి చెక్ పెట్టి హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 183/6 స్కోరు చేసింది.
తర్వాత చెన్నై 20 ఓవర్లలో 158/5 స్కోరుకే పరిమితమైంది. విజయ్ శంకర్ (54 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 69 నాటౌట్), ధోనీ (26 బాల్స్లో 1 ఫోర్, 1 సిక్స్తో 30 నాటౌట్) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రాహుల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాహుల్ నిలకడ:
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్లో రాహుల్ పెద్దన్నగా నిలిచాడు. ఇన్నింగ్స్ నాలుగో బాల్కే హిట్టర్ జాక్ ఫ్రెజర్ మెక్గర్క్ (0)ను ఖలీల్ అహ్మద్ (2/25) డకౌట్ చేసినా, వన్డౌన్లో అభిషేక్ పోరెల్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఈ ఇద్దరు వీలైనప్పుడ్లలా ఫోర్లు, సిక్స్లు బాదడంతో పవర్ప్లేలో 51/0 స్కోరు వచ్చింది. అయితే ఏడో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన జడేజా.. అభిషేక్ను ఔట్ చేసి రెండో వికెట్కు 54 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. సిక్స్తో ఖాతా తెరిచిన కెప్టెన్ అక్షర్ పటేల్ (21) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేకపోయాడు.
11వ ఓవర్లో నూర్ అహ్మద్ (1/36) బౌలింగ్లో ఔట్ కావడంతో మూడో వికెట్కు 36 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అయినప్పటికీ నూర్, జడేజా బౌలింగ్లో భారీ సిక్స్లు కొట్టిన రాహుల్ 33 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్లో సమీర్ రిజ్వీ (20) వేగంగా ఆడి నాలుగో వికెట్కు 56 రన్స్ జత చేశాడు. చివర్లో ట్రిస్టాన్ స్టబ్స్ (24 నాటౌట్) హిట్టింగ్కు దిగాడు. అవతలి వైపు రాహుల్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఐదో వికెట్కు 33 రన్స్ వచ్చాయి. మరో నాలుగు బాల్స్ ఉండగా రాహుల్ ఔటైనా ఢిల్లీ మంచి టార్గెట్ను నిర్దేశించింది.
శంకర్, ధోనీ పోరాడినా..
భారీ ఛేజింగ్లో చెన్నై బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. ఇన్నింగ్స్ మధ్యలో విజయ్ శంకర్ ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్లో సహకారం దక్కలేదు. రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర (3) ఔట్తో తడబడ్డ ఇన్నింగ్స్ ఎక్కడా కోలుకోలేదు. మూడో ఓవర్లో రుతురాజ్ (5) వెనుదిరిగాడు. ఈ దశలో డేవన్ కాన్వే (13).. విజయ్తో కలిసి మూడో వికెట్కు 21 రన్స్ జత చేయడంతో పవర్ప్లేలో సీఎస్కే 46/3తో నిలిచింది. కానీ ఫీల్డింగ్ పెరిగిన తర్వాత మళ్లీ విజృంభించిన ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో శివం దూబే (18), జడేజా (2)ను వెనక్కి పంపారు. దీంతో 11 ఓవర్లలో చెన్నై 74/5తో ఎదురీత మొదలుపెట్టింది.
ఈ టైమ్లో వచ్చిన ధోనీని కట్టడి చేయడంలో డీసీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్తో ఢిల్లీ ఆకట్టుకుంది. దీంతో మహీ, శంకర్ సింగిల్స్కే పరిమితం కావడంతో సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరిగింది. చివర్లో ధోనీ ఫోర్, సిక్స్తో జోష్ పెంచాడు. ఈ ఇద్దరు కలిసి ఆరో వికెట్కు 84 రన్స్ జత చేసినా టార్గెట్ను అందుకోలేకపోయారు. విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు తీశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో183/6 (కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, ఖలీల్ అహ్మద్ 2/25).
చెన్నై: 20 ఓవర్లలో 158/5 (విజయ్ శంకర్ 69*, ధోనీ 30*, నిగమ్ 2/27).
స్టేడియంలో మహీ పేరెంట్స్... రిటైర్మెంట్పై మళ్లీ పుకార్లు
చెన్నై లెజెండ్ ధోనీ పేరెంట్స్ పాన్ సింగ్, దేవకి దేవి తొలిసారి ఐపీఎల్ మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చారు. చెపాక్ స్టేడియంలో మహీ ఆటను చూశారు. భార్య, కూతురు కూడా మ్యాచ్కు రావడంతో ధోనీ రిటైర్మెంట్పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ధోనీ ఆఖరాట ఆడేశాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వీటిని సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్ ఖండించాడు. ధోనీ మరింత బలంగా తయారవుతున్నాడని చెప్పాడు.