ఆన్ లైన్‌‌లో చూసి కరెన్సీ ప్రింటింగ్.. తుక్కుగూడ వద్ద నిందితుడి అరెస్ట్

ఆన్ లైన్‌‌లో చూసి కరెన్సీ ప్రింటింగ్..  తుక్కుగూడ వద్ద నిందితుడి అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉన్నత చదువులు చదివి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని  మహేశ్వరం జోన్ పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులతో కలిసి ఎస్​వోటీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.5 లక్షల విలువైన రూ.500 నోట్లను, 45 జీఎస్​ఎమ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన కార్లి నవీన్ కుమార్.. సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. 

ఉబెర్, రాపిడో డ్రైవర్​గా పని చేస్తున్న అతను.. డబ్బులు సరిపోక ఈజీ మనీ కోసం సెర్చ్ ఆన్ లైన్ నకిలీ కరెన్సీ తయారీ గురించి తెలుసుకున్నాడు. యానిమేషన్, డిజైనింగ్​లో నాలెడ్జ్ ఉండటంతో నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి ప్లాన్ చేశాడు. ఈపీఓఎన్ కలర్ ప్రింటర్​ను ఉపయోగించి నకిలీ రూ.500 నోట్లను తయారు చేశాడు. అలా.. రూ.5 లక్షల నకిలీ రూ.500 నోట్లు తయారు చేశాడు. 

గురువారం ఆ నకిలీ నోట్లను తన ఏజెంట్​కు ఇవ్వడానికి నవీన్ తుక్కుగూడకు వస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు నవీన్​ను అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్‌‌లోని దివిటిపల్లి చౌరస్తాలో అతను ఉంటున్న అద్దె ఇంటిలో సోదాలు చేసి,  ల్యాప్ టాప్, ప్రింటింగ్ మెషిన్లను, స్వాధీనం చేసుకున్నారు.