
హైదరాబాద్, వెలుగు: గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై ఈ నెల 21న సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించనుంది. రెండు రాష్ట్రాలు, జీఆర్ఎంబీ ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించింది. గోదావరి, దాని సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీకి చెందిన హైడ్రాలజీ (సౌత్) డిపార్ట్మెంట్ 2023లో స్టడీ చేసింది. ఆ రిపోర్టును జీఆర్ఎంబీకి సమర్పించింది. దానిపై రెండు రాష్ట్రాల వివరణను జీఆర్ఎంబీ కోరగా.. అదే ఏడాది ఆగస్టులో కామెంట్స్ పంపించారు. రెండు రాష్ట్రాలు చేసిన సూచనలకు అనుగుణంగా హైడ్రాలజీ స్టడీపై మరోసారి రివ్యూ చేయాలంటూ జీఆర్ఎంబీ కోరింది. ఈ నేపథ్యంలోనే 21న సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.