
- మయన్మార్, థాయ్లాండ్ బోర్డర్లో చైనీస్ డెన్
- ఇండియన్లను ట్రాప్ చేసి మయన్మార్ బోర్డర్లో నిర్బంధం
- అమెరికన్లు టార్గెట్గా కాల్ సెంటర్
- ఫేక్ క్రిప్టో గోల్డ్ కాయిన్లు కొనిపించాలని ఒత్తిడి
- మూడు నెలలు చిత్రహింసలు అనుభవించిన నల్లగొండ వాసి
- మయన్మార్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్తో విముక్తి
- ఢిల్లీ ఆర్మీ ఎయిర్బేస్ ద్వారా హైదరాబాద్కు బాధితుడు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లు రాష్ట్ర యువతను టార్గెట్ చేశారు. విదేశాల్లో ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి థాయ్ లాండ్, మయన్మార్కు తరలిస్తున్నారు. అక్కడే నిర్బంధించి అమెరికా సిటిజన్లకు కాల్స్ చేయిస్తున్నారు. నకిలీ క్రిప్టో కరెన్సీ, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయించాలని బాధితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలాంటి గ్యాంగ్లో చిక్కుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు నాలుగు నెలల పాటు చిత్రహింసలకు గురయ్యాడు.
మయన్మార్ ఆర్మీ రెస్యూ ఆపరేషన్తో ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నాడు. నల్లగొండ జిల్లా చండూరు చలమలపల్లి గ్రామానికి చెందిన వేణు (23) గతేడాది డిగ్రీ పూర్తి చేశాడు. నాగోల్కు చెందిన తన స్నేహితుడు అభిషేక్ థాయ్లాండ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నాడు.
నిరుడు అక్టోబర్లో అభిషేక్ ఇండియాకు రావడంతో అతన్ని కలిశాడు. థాయ్లాండ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ ఇప్పిస్తానని వేణుకు అభిషేక్ చెప్పాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసం చైనీస్ ఐడీతో ఉన్న టెలిగ్రాం ఐడీని పంపించాడు. వీడియో కాల్ ఇంటర్వ్యూ ద్వారా స్పీడ్ టైపింగ్, ఇంగ్లిష్ స్కిల్ టెస్ట్ పెట్టారు. సెలెక్ట్ అయ్యావని చెప్పారు. బ్యాంకాక్కు వచ్చేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని చెప్పారు.
ఇందుకు అభిషేక్ ఇచ్చిన సంతోష్ సింగ్ నేగి అనే వ్యక్తి నంబర్కు నవంబర్ 14న వేణు రూ.25 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. అభిషేక్ స్నేహితులు సంతోష్, సంజయ్ అనే వ్యక్తులు తాము మయన్మార్లో పనిచేస్తున్నట్లు వేణుకు చెప్పారు. ఈ ముగ్గురు కలిసి ఫ్లైట్ టికెట్ను వాట్సాప్లో పంపించారు. నవంబర్ 16న కోల్కతా మీదుగా వేణు.. బ్యాంకాక్ చేరుకున్నాడు. అక్కడే సంజయ్, సంతోష్, అభిషేక్ కలిసి వేణును రిసీవ్ చేసుకున్నారు. వేణుకు అక్కడే ఓ రూమ్లో షెల్టర్ ఇచ్చారు.
మయన్మార్, థాయ్లాండ్ బోర్డర్లో నిర్బంధం
నవంబర్18న వేణుకు టెలిగ్రాంలో ఓ కారు ఫొటో వచ్చింది. అభిషేక్ ఆ కారులో ట్రావెల్ చేసి స్పాట్కు చేరుకోవాలని సూచించాడు. దీంతో వేణు 56 గంటల పాటు జర్నీ చేసి థాయ్లాండ్ బోర్డర్కు చేరుకున్నాడు. ఆ తరువాత కారులో ఉన్న వ్యక్తులు వేణును బలవంతంగా బోటులో మయన్మార్ బోర్డర్కు తరలించారు. అక్కడ మయన్మార్ మిలిటరీ యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వేణును స్థానిక కేకే 14 పార్క్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.
వేణు వద్ద ఉన్న పాస్పోర్ట్ తీసుకుని షాన్షబ్ అనే కంపెనీలో వదిలివెళ్లాడు. అక్కడ ఓ బిల్డింగ్లో దాదాపు 300 వందల మంది పనిచేస్తున్నారు. అక్కడ వేణుకు ఈ18 అనే కోడ్తో బ్యాడ్జ్ వేశారు. సంవత్సరం పాటు కాంట్రాక్ట్ కింద సంతకాలు చేయించుకున్నారు. ఫేస్బుక్ ద్వారా అమెరికా మహిళలతో చాటింగ్ చేయాలని, వారిని ట్రాప్ చేసి ఫేక్ క్రిప్టో కరెన్సీ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయించాలని బలవంతం చేశారు.
దీంతో వేణు అమెరికన్ల ప్రొఫైల్స్ సేకరించాడు. ఆ ప్రొఫైల్స్ను చైనా, ఉగాండాకు చెందిన టీమ్ లీడర్లకు పంపించేవాడు. చైనీస్ క్రంటోల్లో ఉన్న వెబ్సైట్ ద్వారా ఫేక్ క్రిప్టో కరెన్సీ, గోల్డ్ కాయిన్స్ను కొనుగోలు చేయించేవారు. పారిపోయేందుకు యత్నించిన వేణును చిత్రహింసలకు గురిచేశారు.
35 రోజులు ఆశ్రయం ఇచ్చిన మయన్మార్ ఆర్మీ
మయన్మార్ కేకే 14 పార్క్ బిల్డింగ్లో నిర్బంధంలో ఉన్న వేణుతో పాటు మరో పది మంది కూడా తప్పించుకుని ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు ఓ చైనా దేశస్తుడు రూ3.48 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బు లేక వేణు సహా పది మంది తిరిగి రాలేకపోయారు. ఇదే సమయంలో కేకే14 పార్క్లో ఉన్నవారిని కాపాడేందుకు మయన్మార్ ఆర్మీ జనవరిలో రెస్క్యూ ఆపరేషన్ చేసింది.
వేణు సహా 262 మందిని అక్కడి నుంచి తరలించింది. వేణు దగ్గర డబ్బు లేకపోవడంతో షాన్షబ్ కంపెనీ నుంచి రూ.23,212 ఆర్మీ ఇప్పించింది. తరువాత వారందరికీ మయన్మార్ ఆర్మీ 35 రోజులు ఆశ్రయం ఇచ్చింది. ఇమిగ్రేషన్ ద్వారా ఇండియన్ ఎంబసీ రెస్క్యూ టీమ్కు వేణును అప్పగించారు. అక్కడి నుంచి వేణు ఈనెల 11న ఢిల్లీలోని ఆర్మీ ఎయిర్బేస్కు చేరుకున్నాడు. సీబీఐ అధికారులు వేణును విచారించి స్టేట్మెంట్ తీసుకున్నారు.
డొమెస్టిక్ ఫ్లైట్లో బుధవారం హైదరాబాద్కు తరలించారు. బాధితుడు గురువారం రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ కేవీఎం ప్రసాద్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కేసు నమోదు చేశారు. అభిషేక్, సంజయ్, సంతోష్ సింగ్ను ఎఫ్ఐఆర్లో దర్యాప్తు చేస్తున్నారు.