
- నమ్మి రూ.85,300 ఫోన్ పే చేసిన వ్యక్తి
- మోసపోయానని యాదాద్రి జిల్లా పోలీసులకు కంప్లయింట్
యాదాద్రి, వెలుగు : ఆవులు అమ్ముతామని వచ్చిన మెసేజ్, ఫొటోలను చూసి నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వ్యక్తి మోసపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సెల్ఫోన్ కు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఆవులు అమ్ముతామని వాట్సాప్ లో మెసేజ్, ఫొటోలు వచ్చాయి. అందులో మూడు ఆవులను సెలెక్ట్ చేసుకోమని మెసేజ్ రాగా అలానే చేశాడు.
వాటికి మొత్తం రూ.1.05 లక్షలు ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమనగా నమ్మి వెంటనే రూ.85,300 ట్రాన్స్ ఫర్ చేశాడు. మొత్తం మనీ పంపితేనే ఆవులను పంపుతామని మరో మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయిన బాధితుడు 1930కు ఫోన్ చేసి కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్ లను నమ్మి మోసపోవద్దని భువనగిరి రూరల్ పోలీసులు సూచించారు.