
- రూ.80 లక్షల విలువైన ఆస్తులు, కారు స్వాధీనం
వనపర్తి, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తండాలు, గ్రామాల్లో యువకులకు డబ్బు ఆశ చూపి సైబర్ నేరాల వైపు మళ్లిస్తున్న సైబర్ నేరాల ప్రధాన సూత్రదారుడు వర్త్యావత్ రమేశ్ నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సైబర్ క్రైం డీఎస్పీ ఎన్బీ రత్నం, సీఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం వనపర్తిలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
నాలుగేండ్లుగా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు రమేశ్నాయక్ ఇప్పటివరకు రూ. కోటికి పైగా సంపాదించాడని చెప్పారు. నిందితుడికి సహకరించిన అతడి అన్న చంద్రశేఖర్, తల్లి గోపమ్మపై కేసు నమోదు చేశామని తెలిపారు. సైబర్ మోసాలతో సంపాదించిన డబ్బులతో రూ.45 లక్షలతో తండాలో ఇల్లు కట్టాడని, వనపర్తి పట్టణంలో రూ. 24 లక్షల విలువైన రెండు ప్లాట్లను, రూ.12.50 లక్షల కారు కొన్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసినట్లు తెలిపారు.