పబ్​లు, హోటళ్ల ప్రతినిధులతో డీసీపీ భేటీ

పబ్​లు, హోటళ్ల ప్రతినిధులతో డీసీపీ భేటీ

గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల గచ్చిబౌలి ప్రిజం పబ్​లో జరిగిన​ కాల్పుల ఘటనతో  సైబరాబాద్​పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్​ అయ్యారు. మాదాపూర్​జోన్​పరిధిలోని పబ్​లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జిలు, వినోద సంస్థలు, ఈవెంట్​ మేనేజర్లు, ప్రైవేట్​సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో డీసీపీ డా. వినీత్ గురువారం​సమావేశమయ్యారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్​కమిషనరేట్​ఆఫీస్​లో మీటింగ్​ నిర్వహించి భద్రత ఏర్పాట్లు, మేనేజ్​మెంట్ల పాత్రపై చర్చించారు.

శాంతిభద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులకు సహకరించాలని డీసీపీ సూచించారు. ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు కచ్చితంగా 2005 పీఎస్​ఏఆర్ఏ యాక్ట్​ రూల్స్​ను పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసు, సైనిక, పారామిలిటరీ దశాల యూనిఫాంను సెక్యూరిటీ సిబ్బంది ధరించవద్దన్నారు. పబ్​లు, బార్లు, రెస్టారెంట్లను సమయానికి క్లోజ్​ చేయాలన్నారు. డ్రగ్స్, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మాదాపూర్​జోన్​ ఏడీసీపీ, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు.