![కొరియర్ పేరుతో లూటీ.. కొత్త స్కామ్కు తెరతీసిన సైబర్నేరగాళ్లు](https://static.v6velugu.com/uploads/2025/02/cybercriminals-have-unleashed-the-call-forward-scam_k8aYoZOpsr.jpg)
- కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరతీసిన సైబర్నేరగాళ్లు
- కొరియర్ వచ్చిందంటూ ఫోన్..*401# కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్
- కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్.. ఫోన్ హ్యాక్
- ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. కాల్ ఫార్వర్డ్ కోడ్స్తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొరియర్, ఈ కామర్స్ నుంచి కాల్ చేస్తున్నామంటూ కాల్ ఫార్వర్డింగ్ చేయిస్తున్నారు. ఇలా ఫోన్ నంబర్స్ను తమకు వచ్చేలా కోడ్ ఎంటర్ చేయాలని సూచిస్తున్నారు. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కస్టమర్స్కు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలు ఆయా సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతున్నాయి.
దీని ద్వారా ఆన్లైన్లో అందినంతా దోచేస్తున్నారు. *401# కోడ్ ఎంటర్ చేయగానే తమ ఫోన్లోని సమాచారం అంతా హ్యాక్ అయ్యిందని ఢిల్లీ, ముంబైలో సైబర్ నేరాలు నమోదయ్యాయి. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తమైంది. సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేసి సోషల్మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.
కొరియర్ వచ్చిందంటూ కాల్స్
ఆన్లైన్ సర్వీసెస్ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫేక్ వెబ్సైట్స్, టోల్ఫ్రీ నంబర్స్తో డోర్ డెలివరీ స్కామ్కు తెరతీశారు. ప్రముఖ ఈ కామర్స్, కొరియర్ సంస్థల కస్టమర్ కేర్ పేరుతో కాల్స్ చేస్తున్నారు. కొరియర్ వచ్చిందని.. డోర్ డెలివరీ కోసం బాయ్కి కాల్ ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాల్ ఫార్వర్డ్చేసేందుకు *401# డయల్ చేయాలని సూచిస్తున్నారు. అనుమానంతో ఆరా తీసే వారిని నమ్మించేందుకు కస్టమర్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. తాము ఎలాంటి ఆర్డర్ చేయలేదని చెప్పినప్పటికీ.. పార్సిల్పై ఫోన్ నంబర్ ఉందని చెప్తున్నారు. అవసరం లేకపోతే డెలివరీ సమయంలో రిటర్న్ చేసే అవకాశం ఉందని నమ్మిస్తున్నారు.
కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ డైవర్ట్
కొరియర్ సర్వీసెస్ పేరుతో నమ్మించి కోడ్ను మొబైల్లో ఎంటర్ చేయిస్తున్నారు. ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో అలర్ట్గా ఉంటారు. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కస్టమర్స్కు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలు ఆయా సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతాయి. కస్టమర్ ఫోన్ కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీంతో మొబైల్తో లింకైన నెట్బ్యాంకింగ్ సమాచారం సహా బ్యాంక్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇలాంటి మోసాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే, రాష్ట్రంలో ఇలాంటి కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడ్స్ ద్వారా మనకు వచ్చే కాల్స్, మెసేజ్లు, ఓటీపీలు నేరస్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. సైబర్ క్రైమ్ అనాలసిస్లో ఇలాంటి కొత్త తరహా మోసాలను గుర్తించామని వెల్లడించారు.