బషీర్ బాగ్, వెలుగు : హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడికి(71) సైబర్ నేరస్తులు కాల్ చేసిన తన పేరుతో ముంబై నుంచి కొరియర్లో డ్రగ్స్ పార్సల్ అవుతున్నాయని , కేసులు అయ్యాయని భయపెట్టి డబ్బులు లాగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. బాధిత వృద్ధుడికి డీటీడీసీ కొరియర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటూ ఈ నెల 11న కొందరు కాల్ చేశారు.
తన పేరుతో ముంబై నుంచి తైవాన్ కు పార్సిల్ ఉందని, దాంట్లో ఐదు కేజీల బట్టలు, ఎనిమిది బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ తో పాటు 700 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయని , ముంబై లో కేసు నమోదు అయిందని చెప్పారు. అనంతరం ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమని వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. మనీలాండరింగ్ , డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో లావాదేవీలు జరిగాయని భయపెట్టారు. ముంబై ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ , సీబీఐలో కేసులు నమోదు అయ్యాయన్నారు.
వీటి నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని చెప్పగా.. వృద్ధుడు రూ. 1 లక్ష 16 వేలు పంపాడు. కాసేపటికి జరిగిన విషయాన్ని అతని భార్యకు తెలపడంతో, ఆమె అనుమానించింది. దీంతో వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.