
ములుగు, వెలుగు : దళితబంధు నిధులను వెంటనే లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేయాలని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు అందజేయాలని కోరారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్ ఆధ్వర్యంలో గురువారం ములుగు గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్బాబు మాట్లాడుతూ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపికైన 1,100ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం సరికాదన్నారు. దళితుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిరసన దీక్షకు పలువురు నాయకులు, లబ్ధిదారులు మద్దతు పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, సీపీఎం నాయకుడు రత్నం రాజేందర్, ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, సీపీఐ నాయకుడు రత్నం ప్రవీణ్, దళిత బంధు సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు కర్రి శ్యాంబాబు పాల్గొన్నారు.