
సంగారెడ్డి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలిస్తే తప్పేంటని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై సంగారెడ్డి జిల్లాలో అందోల్ లో ఇవాళ ఆయన మాట్లాడారు. తెలంగాణ పౌరులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా సీఎంని కలవొచ్చన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారంపై తనకు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. సమస్యలపై ఎవరు వచ్చి కలిసినా తమ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంటుందని రాజనర్సింహ పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హై స్కూళ్లలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రక్త పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. రక్త హీనత తక్కువగా ఉంటే అందుకు కావలసిన ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి కార్యక్రమం ఆందోల్ నియోజకవర్గంలో ప్రారంభించామన్నారు.