
- స్పాట్వద్దకు చేరుకున్న డిప్యూటీ డీఎంహెచ్వో, ఫోరెన్సిక్ నిపుణులు
- మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు
- తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్స్ పలువిధాలా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తుండగా.. వారి డెడ్బాడీ ఆనవాళ్లను జీపీఆర్, థర్మల్ స్కానర్లతో శుక్రవారం గుర్తించారు.
గల్లంతైన వారి ఆచూకీ కోసం వారం రోజులుగా రెస్క్యూ టీమ్లు శ్రమిస్తుండగా.. శుక్రవారం మధ్యాహ్నం ఎన్ జీఎస్ఐ, ఎన్ జీఆర్ఐ టీమ్స్ కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మధ్యాహ్నం జీపీఆర్ (గ్రాండ్ పినట్రేటింగ్ రాడార్), థర్మల్ స్కానర్లతో 13.9 కిలోమీటర్ పాయింట్ వద్ద బురదలో స్కాన్ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 8 చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల వద్ద మార్కింగ్చేశారు.
అక్కడ మనుషుల ఆనవాళ్లు ఎంత లోపల ఉన్నాయి? వాటిని ఎలా బయటకు తీసుకురావాలి? అని ఆఫీసర్లు చర్చలు జరుపుతున్నారు. కాగా, దీనిపై ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. సింగరేణి సీఎండీ బలరాం మీడియాతో మాట్లాడుతూ.. 8 మంది చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించామని, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి క్లియర్ రాడార్ పిక్చర్స్ వచ్చిన తర్వాతే నిర్ధారణ జరుగుతుందని చెప్పారు. దీనికి మరో 2 రోజులు పడుతుందని ఆయన సమాధానం ఇచ్చారు.
టన్నెల్ లోకి యంత్రాలు
టన్నెల్లో పేరుకుపోయిన మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఆర్మీ నుంచి బాట్ క్యాట్ మెషీన్ను తెప్పించారు. దీని ద్వారా మట్టిని ఎత్తుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆక్వా ఐ మెషీన్ను తీసుకురాగా, ఇది నీటిలో మనుషుల ఆనవాళ్లను గుర్తించి, సిగ్నల్ ఇస్తున్నది. మనిషి కాకుండా ఇతర ఏ జంతువుల కళేబరాలు ఉన్నా.. ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదు. అలాగే 100 హెచ్ పీ మోటారు ఒకటి, 50 హార్స్ పవర్ ఉన్న మోటార్లు ఐదింటిని టన్నెల్లోకి తీసుకెళ్లి వాటితో డీ వాటరింగ్ చేస్తున్నారు.
బురద, మట్టి, టీబీఎం శిథిలాల తొలగింపు షురూ
టన్నెల్ వద్ద బురద, మట్టి, టీబీఎం శిథిలాల తొలగింపు అతి పెద్ద టాస్క్. వీటిలో బురద, మట్టి తరలింపు పనులు గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీమ్ ఈ పనులు చేపడుతున్నది. గురువారం వరకు ఈ టీమ్లో 100 మంది వరకు టన్నెల్ వద్దకు రాగా.. శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో 200 మంది వచ్చారు.
ఈ కంపెనీ నుంచి మొత్తం 300 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా బురద, మట్టి తీసే పనిలో నిగమ్నం కానున్నారు. ట్రిప్కు 50 మంది చొప్పున టన్నెల్లోకి వెళ్తున్నారు. గురువారం రాత్రి 50 మంది టన్నెల్లోకి వెళ్లి ఉదయం 11 గంటలకు తిరిగి వచ్చారు. 12వ కిలోమీటరు నుంచి పేరుకుపోయిన బురద, మట్టిని వీరు మ్యానువల్గా పారా, తట్టలతో ఎత్తుతున్నారు.
తీసిన మట్టిని లోకోలోకి ఎత్తి పోసి బయటకు పంపిస్తున్నారు. ఆ తర్వాత ఈ బురదను సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. 140 మీటర్ల పొడవు, 1500 టన్నుల బరువున్న టీబీఎం శిథిలాలను శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి కాజీపేటకు చెందిన రైల్వే సిబ్బంది ప్రత్యేక మిషన్తో కట్ చేస్తున్నారు. కట్ చేసిన పైపులను మ్యానువల్గా తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే డంప్ చేశారు.
ఫోరెన్సిక్ బృందానికి పిలుపు..
టన్నెల్ లోపల మృత దేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్స్ శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హుటాహుటిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని, నాగర్కర్నూల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో తారాసింగ్ను పిలిపించారు. డీఎన్ఏ టెస్టుల అనంతరం డెడ్బాడీలను గుర్తించి, బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిసింది.
లోకో ట్రాక్ను సిద్ధం చేసేందుకు..
ప్రమాద స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. ఇక్కడే టీబీఎం సగభాగం కూరుకుపోయింది. అయితే ఈ మట్టిని బయటకు తరలించేందుకు మ్యానువల్గా సాధ్యం అయ్యే చాన్స్ లేకపోవడంతో.. లోకోను ఇక్కడి వరకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 3 రోజుల కిందట యాక్సిండెంట్ చివరి పాయింట్ వరకు వెళ్లి వచ్చిన ఆఫీసర్లు.. ఇక్కడ మట్టిని తరలించడానికి లోకో ట్రాక్పై ఉన్న బురదను క్లియర్ చేయడంతోపాటు కన్వేయర్ బెల్టును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో 12వ కిలోమీటరు నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన ఒక మీటరున్నర మట్టిని ఎత్తి పోస్తున్నారు. ఆ తర్వాత లోకోను 13.5 కిలోమీటరు వరకు తీసుకొచ్చి మట్టిని దాని ద్వారా బయటకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నారు.