- గంటల్లోనే నిందితురాలి అరెస్ట్
ముంబై: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని కొద్దిరోజుల కింద చంపిన మాదిరిగానే యూపీ సీఎంను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముంబై పోలీస్ కంట్రోల్ రూం హెల్ప్లైన్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ‘‘బాబా సిద్ధిఖీలాగే యోగి ఆదిత్యనాథ్ను చంపుతాం. ఆయన 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నిందితురాలు ఐటీ గ్రాడ్యుయేట్
అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్రకు వచ్చే అవకాశమున్నందున ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెదిరింపు వచ్చిన నంబర్ను కొద్ది గంటల్లోనే ట్రేస్ చేశారు. నిందితురాలిని థానె జిల్లా ఉల్లాస్నగర్కు చెందిన 24 ఏండ్ల ఫాతిమా ఖాన్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివారని, తండ్రి టింబర్ బిజినెస్ చేస్తున్నారని తెలిపారు. కుటుంబంతో కలిసి ఉంటున్న ఫాతిమా మానసిక స్థితి సరిగాలేదని గుర్తించినట్లు వెల్లడించారు.
కాగా, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సిద్ధిఖీని గత నెల 12న ముంబైలోని బాంద్రాలో దుండగులు కాల్చి చంపేశారు. ఇది తమ పనే అంటూ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోగా.. ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య తర్వాత కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పలువురికి బెదిరింపులు వచ్చాయి. ఆదివారం ఇదే మాదిరిగా యూపీ సీఎంను చంపేస్తామని మెసేజ్ రావడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.