
న్యూఢిల్లీ: అప్పులతో ఇబ్బంది పడుతున్న స్పైస్జెట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా ఫండ్స్ సేకరించాలని చూస్తోంది. ఈ నెల 23 న జరిగే బోర్డ్ మీటింగ్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రెండు విడతల్లో రూ. 2,242 కోట్ల క్యాపిటల్ను సేకరించడానికి ఈ ఏడాది జనవరిలో బీఎస్ఈ నుంచి స్పైస్జెట్ అనుమతులు పొందింది. కాగా, ఈ ఎయిర్లైన్ కంపెనీ కార్యకలాపాలు గత కొన్ని క్వార్టర్లుగా తగ్గాయి.
ఈ నెల 19 నాటికి స్పైస్జెట్కు చెందిన 33 విమానాలు గ్రౌండ్ అయ్యాయి. 11,581 మంది ఉద్యోగుల పీఎఫ్ మనీని కంపెనీ డిపాజిట్ చేయలేదని రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో స్పైస్జెట్ రూ.119 కోట్ల నికర లాభాన్ని, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.209.43 కోట్ల నష్టాన్ని పొందింది.