ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం

ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పుల గండం
  • బడ్జెట్‌‌లో ఈ శాఖకు రూ.23,373 కోట్లు.. 
  • ఇందులో అప్పుల చెల్లింపులకే రూ.10 వేల కోట్లు 
  • ఒక్క కాళేశ్వరం కిస్తీలకే రూ.7 వేల కోట్లు  
  • సిబ్బంది జీతభత్యాలకు మరో రూ.1,600 కోట్లు 
  • ఇవన్నీ పోనూ మిగిలేవి రూ.12 వేల కోట్లే 
  • వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే 
  • ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, డిండి, సీతారామ, ఎస్ఎల్‌‌బీసీ పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ 
  • ఇవన్నీ పూర్తి కావాలంటే రూ.30 వేల కోట్లకుపైనే అవసరం 

హైదరాబాద్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులకు అప్పులు గండంగా మారాయి. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌‌లో రూ.23,373 కోట్లు కేటాయించగా.. అందులో శాఖ పరిధిలోని అప్పుల చెల్లింపులు, ఇతర ఖర్చులకే రూ.11 వేల కోట్లకు పైగా పోనున్నాయి. అప్పులకు మొత్తం రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు లోన్ కిస్తీలకే రూ.7 వేల కోట్ల మేర చెల్లించాల్సిన పరిస్థితి. సిబ్బంది జీతభత్యాలకు మరో రూ.1,600 కోట్లు పోనున్నాయి. ఇక, మిగిలిన రూ.12 వేల కోట్లతోనే ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్​ మెయింటెనెన్స్ చూసుకోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. 

అయితే ఈ ఏడాది చివరి కల్లా కొన్ని ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా, ఈ నిధులతో అది సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్, సీతారామ, ఎస్ఎల్‌‌బీసీ లాంటి పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేవాదుల ప్రాజెక్టునూ త్వరితగతిన పూర్తి చేయాలని టార్గెట్​పెట్టుకుంది. ఆయా ప్రాజెక్టులకే రూ.30 వేల కోట్లకు పైగా అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇరిగేషన్​ అధికారులు రూ.27 వేల కోట్ల వరకు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా, రూ.23,373 కోట్లకే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

కాగా, ప్రాధాన్య ప్రాజెక్టులు సహా రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలంటే దాదాపు రూ.60 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.  పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2015లో రూ.35,200 కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తికాకముందే 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నార్లాపూర్​జలాశయంలోని ఓ పంపును నాటి సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. ప్రాజెక్టులోని 2, 3, 4, 6, 7, 11, 14, 15, 17 ప్యాకేజీల పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. నార్లాపూర్​రిజర్వాయర్​ మొత్తం పూర్తికాగా.. ఏదుల రిజర్వాయర్​పూర్తి కావొచ్చింది. 

నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు ఆరు రిజర్వాయర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇంకా కాలువల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిజైన్ల దశలోనే ఉన్నది. నార్లాపూర్ నుంచి ఏదుల జలాశయానికి నీళ్లు తరలించే కాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మధ్యలో పెద్ద బండరాయి అడ్డు రావడంతో కంట్రోల్ట్​బ్లాస్ట్​చేయాల్సి రావడం, రివైజ్డ్​టెండర్లను పిలిచే యోచనలో ఉండడంతో పనులు ముందుకు కదలడం లేదు. నార్లాపూర్​జలాశయం నుంచి సాతాపూర్​సొరంగం వరకు 8 కిలోమీటర్ల మేర కాల్వలను నిర్మించాల్సి ఉంది. 

ఆ కాల్వ మధ్యలో నాలుగు బ్రిడ్జీలను కట్టాలి. ఈ పనులన్నీ పూర్తయితేనే నార్లాపూర్​నుంచి ఏదుల వరకు నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రూ.22 వేల కోట్లకు పైగానే అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తిప్పి పంపింది. దానికి సంబంధించిన పనులూ ఇప్పటికీ పెండింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో పాలమూరు ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.1,700 కోట్లే కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

డిండికి కూడా నిధులు కావాల్సిందే.. 

డిండి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసేందుకూ నిధులు భారీగానే అవసరం కానున్నాయి. రూ.6,190 కోట్ల అంచనాలతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్​నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రూ.1,800 కోట్లతో అంచనాలను సిద్ధం చేయనున్నారు. ఏదుల నుంచి కాలువలు తవ్వి, పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్​డ్యామ్ నిర్మించి.. అక్కడి నుంచి డిండికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో డిండి లిఫ్ట్​కోసం రూ.1,600 కోట్లు కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టుకు మరిన్ని నిధులు అవసరమవుతాయన్న చర్చ జరుగుతున్నది. మరోవైపు దేవాదుల ప్రాజెక్టు మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించి ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల ప్రాజెక్టునూ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కోసం రూ.300 కోట్లను కేటాయించింది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఈ రెండు ప్రాజెక్టులకే అంతోఇంతో సరిపోనూ నిధులను సర్కార్ కేటాయించింది. 

ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ముందుకు.. వెనక్కి? 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు తలపెట్టిన ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ ప్రాజెక్టు పరిస్థితి ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. నిరుడు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ప్రాజెక్టు కోసం అంచనాలను సవరించిన ప్రభుత్వం రూ.4,650 కోట్లను మంజూరు చేసింది. 

ఈ ప్రాజెక్టులో మరో 9 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వితే మేజర్​పార్ట్​ పూర్తయినట్టే. కానీ, ఇప్పుడు అనుకోని ప్రమాదంతో ఆ పనులు సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్​నడుస్తూనే ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా ఆ నిధులను మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం రూ.900 కోట్లే కేటాయించింది.  

సీతారామకూ తక్కువే కేటాయింపులు  

సీతారామ సాగర్​ప్రాజెక్టునూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇటీవల రూ.19 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ.9 వేల కోట్ల మేర  ఖర్చు చేశారు. 3.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు.. భూసేకరణ కోసమే రూ.6 వేల కోట్ల దాకా ఖర్చవుతుందని చెబుతున్నారు. 

కానీ, ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.699 కోట్లే కేటాయించారు. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో క్యాపిటల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పెండిచర్​కింద రూ.33 వేల కోట్లను పెట్టింది. అందులో ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం పెట్టిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్​జిల్లాలో ని నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులనూ పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.