దోమలగూడ పీఎస్ ​పరిధిలో డీబీఆర్​ మిల్లులో యువతి అస్తి పంజరం

దోమలగూడ పీఎస్ ​పరిధిలో డీబీఆర్​ మిల్లులో యువతి అస్తి పంజరం
  •  శ్రీ వివేకానంద హెచ్ఎస్​ లోగో ఉన్న షర్ట్​ జేబు స్వాధీనం 
  •  చనిపోయి నెల దాటి ఉంటుందన్న పోలీసులు  

ముషీరాబాద్, వెలుగు: దోమలగూడ పీఎస్ ​పరిధిలోని లోయర్​ట్యాంక్​బండ్​లో ఉన్న డీబీఆర్​మిల్స్​ప్రాంగణంలో ఓ మహిళ అస్తి పంజరం లభ్యమైంది. చనిపోయి సుమారు 30రోజులు దాటి ఉంటుందని, ఆమె ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే కొన్ని ఆధారాలు దొరికాయని ఇన్​స్పెక్టర్​శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నిరంజన్ తెలిపారు. కవాడిగూడలో ఉన్న డీబీఆర్​మిల్లు మూతబడి ఏండ్లవుతోంది.

కేసు కోర్టులో ఉండడంతో ఇప్పటికీ 25 ఏండ్లుగా నిరుపయోగంగానే ఉంది. దీంతో ఇక్కడ ఒక వాచ్​మెన్​మాత్రమే కాపాలాగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం మిల్స్​ప్రాంగణంలో ఉన్న సంపు నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో వాచ్​మెన్​పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మిల్లుకు చేరుకొని సంపు పైకప్పు తొలగించి చూడగా, ఓ అస్తి పంజరం కనిపించింది. దీంతో పై నుంచి తీసే అవకాశం ఉండడంతో సంపును ఒకవైపు పగలగొట్టారు. పరిశీలించి చూడగా పూర్తిగా కుళ్లిపోయి.. ఇప్పుడిప్పుడే అస్తి పంజరం దశకు చేరుకుంటున్నట్టు స్థితిలో ఉందని గుర్తించారు.

అది ఒక యువతి అస్తి పంజరం అని, చనిపోయి సుమారు 30 రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు.  వయస్సు సుమారు 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్​మార్టం చేసే పరిస్థితి లేకపోవడంతో గాంధీ దవాఖాన సిబ్బందిని అక్కడికే పిలిపించారు. తర్వాత గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు. అస్తి పంజరంపై ఉన్న డ్రెస్​ను కడిగి చూడగా ఓ జేబు బయటపడింది. దానిపై శ్రీ వివేకానంద హెచ్.ఎస్​అని ఉంది.  వివేకానంద పేరుపై చాలా ఇన్​స్టిట్యూషన్స్​ఉండడంతో ఎక్కడిదో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.