
- ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ రోజు కూలీల ద్వారా బయటకు..
- జవాబులు రాశాక మళ్లీ బండిల్స్లోకి..
- కేసు నమోదు చేసిన పోలీసులు
- అధికారుల తీరుపైనా అనుమానాలు
హనుమకొండ, హసన్ పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి డిగ్రీ ఆన్సర్ షీట్స్ ఏకంగా స్టూడెంట్ల ఇండ్లకే వెళ్లాయి. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో రోజుకూలీగా పని చేస్తున్న ముగ్గురు ఈ బాగోతానికి తెరలేపగా..స్టూడెంట్లు ఆ ఆన్సర్ షీట్లు రాసి మళ్లీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లోని బండిల్స్లోకి చేర్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడగా..ఎగ్జామినేషన్ బ్రాంచ్అధికారుల ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాకతీయ వర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో చింతగట్టుకు చెందిన ఎం.సునీల్, పెగడపల్లికి చెందిన జి.రాణా ప్రతాప్, గుండ్ల సింగారానికి చెందిన ఎన్.శ్రీధర్ దినసరి కూలీలు, అటెండర్లుగా పని చేస్తున్నారు. ఐదేండ్ల నుంచి ఎగ్జామినేషన్బ్రాంచ్లోనే పని చేస్తుండగా..బయట తమకు తెలిసిన స్టూడెంట్లు, ఇతర వ్యక్తుల ద్వారా డిగ్రీ విద్యార్థులను పాస్ చేయించేందుకు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా పరీక్షలు పూర్తయిన తర్వాత ఆన్సర్షీట్లన్నీ బండిల్స్ లో కేయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్కు చేరితే..అక్కడి నుంచి ఆన్సర్ షీట్లను బయటకు తీసుకువచ్చి స్టూడెంట్లకు చేరవేసేవారు. వారు మళ్లీ ఆన్సర్లు రాసి ఇస్తే యథాస్థానానికి చేర్చేవారు. ఇటీవల డిగ్రీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ఎగ్జామ్స్ జరగగా, మే 23న ఎగ్జామినేషన్ బ్రాంచ్నుంచి కొన్ని ఆన్సర్షీట్లు బయటకు తీసుకెళ్లి స్టూడెంట్లకు అందజేశారు. ఆ మర్నాడు వాటిని తిరిగి సంబంధిత బండిల్స్లో పెట్టారు. ఇదిలా ఉంటే మే 30న ఎగ్జామినేషన్అడిషనల్ కంట్రోలర్ డా.ఎం.తిరుమలదేవి బ్రాంచ్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా అసలు విషయం బయటపడింది. సునీల్, రాణాప్రతాప్, శ్రీధర్ఆన్సర్ షీట్స్ను రూం నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వర్సిటీ ఎగ్రామ్స్ కంట్రోలర్నరసింహా చారి, అడిషనల్ కంట్రోలర్ తిరుమల దేవి యూనివర్సిటీ పోలీసులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
50 పేపర్లు బయటికి..
పోలీసుల దర్యాప్తులో నిందితులు 50 పేపర్ల వరకు బయటకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఒక్కో పేపర్కు స్టూడెంట్స్ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుండగా, ఈ 50 మందిలో హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. నిందితులు ఐదేండ్ల నుంచి పని చేస్తుండగా ఎంతమందికి ఆన్సర్ షీట్లు చేరవేశారో అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందని కేయూ ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.
ఆఫీసర్ల హస్తం?
వర్సిటీ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్లోని ఆన్సర్ షీట్స్ మూల్యాంకన రూముల్లోకి సిబ్బందికి అందరికీ ప్రవేశం ఉండదు. అవకతవకలు జరిగే ఆస్కారం ఇవ్వకుండా కార్యాలయ సిబ్బంది ప్రవేశానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి గదుల్లోకి దినసరి కూలీలుగా పని చేసే ముగ్గురు ప్రవేశించడం, ఆన్సర్ షీట్లు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీస్లో పని చేసే అధికారుల సహాయం లేనిదే ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెరవెనుక పలువురు అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్సర్ షీట్లు బయటకు వెళ్లిన విషయమై కేయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఎస్.నరసింహా చారిని ఫోన్ లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.