
బెంగళూరు: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నాలుగో విజయాన్ని సాధించింది. చిన్న టార్గెట్ ఛేజింగ్లో మెగ్ లానింగ్ (60 నాటౌట్), షెఫాలీ వర్మ (43 నాటౌట్) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో 8 పాయింట్లతో టేబుల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 123/9 స్కోరు చేసింది. హేలీ మాథ్యూస్ (22), హర్మన్ప్రీత్ కౌర్ (22) ఓ మాదిరిగా ఆడారు.
ఢిల్లీ బౌలర్లు జొనాసెన్ (3/25), మిన్ను మణి (3/17) సమయోచిత బౌలింగ్ ముందు ముంబై బ్యాటర్లు ఘోరంగా తడబడ్డారు. సివర్ బ్రంట్ (18), అమెలియా కెర్ (17), అమన్జోత్ కౌర్ (17 నాటౌట్), యాస్తికా భాటియా (11) నిరాశపర్చారు. ఇన్నింగ్స్లో నలుగురు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ముంబై భారీ టార్గెట్ను నిర్దేశించలేకపోయింది. శిఖా పాండే, సదర్లాండ్ చెరో వికెట్ తీశారు. తర్వాత ఛేజింగ్లో ఢిల్లీ 14.3 ఓవర్లలో 124/1 స్కోరు చేసి నెగ్గింది.
ఆరంభం నుంచే డీసీ ఓపెనర్లు లానింగ్, షెఫాలీ.. ముంబై బౌలర్లపై బౌండ్రీలతో విరుచుకుపడ్డారు. దీంతో తొలి వికెట్కు 59 బాల్స్లోనే 85 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. షెఫాలీ ఔటైన తర్వాత వచ్చిన జెమీమా రొడ్రిగ్స్ (15 నాటౌట్) చెలరేగింది. 40 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన లానింగ్తో కలిసి రెండో వికెట్కు 28 బాల్స్లోనే 39 రన్స్ జత చేసి విజయాన్ని అందించింది. జొనాసెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.