
బార్లీ లేదా యవలు.. ఇవి తృణధాన్యాలు. ఈమధ్యకాలంలో ఓట్స్లానే, బార్లీ కూడా చాలామంది మెనూల్లో చేరింది. ఇవి డయాబెటిస్, కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు.. వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించి కూల్ చేయడంలో బార్లీ ది బెస్ట్! వీటితో ఇలా బ్రేక్ఫాస్ట్, శ్నాక్, డ్రింక్... వంటివి ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెంట్ టేస్ట్తోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బార్లీ రెసిపీలు అస్సలు మిస్కాకండి.
లడ్డు
కావాల్సినవి :బార్లీ గింజల పొడి– రెండు కప్పులు, బాదం, అవిసె గింజలు – ఒక్కోటి అర కప్పు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, యాలకులు – ఐదుబెల్లం – ఒకటిన్నర కప్పు
తయారీ :పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో బార్లీ గింజల పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాన్లో బాదం, అవిసె గింజల్ని నూనె లేకుండా వేగించి పక్కన పెట్టాలి. అవి చల్లారాక మిక్సీజార్లో వేసి, వాటితోపాటు యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీయాలి. ఆ తర్వాత మిక్సీజార్లో బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఆ బెల్లాన్ని కూడా బార్లీ పొడి మిశ్రమంలో వేసి కలపాలి. చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో వేసి బాగా కలపాలి. కాస్త వేడిగా ఉండగానే ఆ పిండి మిశ్రమాన్ని లడ్డూలుగా చేయాలి.
జావ
కావాల్సినవి :
బార్లీ గింజల పొడి – పావు కప్పు
సబ్జా గింజలు – ఒక టీస్పూన్
నీళ్లు – ఐదు కప్పులు
అల్లం – చిన్న ముక్క
ఉప్పు – సరిపడా
నిమ్మరసం – ఒక టీస్పూన్
పెరుగు – అర కప్పు
తయారీ :
సబ్జా గింజల్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. పాన్లో బార్లీ వేసి నూనె లేకుండా వేగించాలి. చల్లారాక వాటిని మిక్సీపట్టాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాన్లో నీళ్లు పోసి ఉప్పు. అల్లం ముక్క వేసి వేడిచేయాలి. నీళ్లు మరిగాక బార్లీ పొడి కలిపిన నీళ్లు కూడా పోయాలి. మరికాసేపు ఆ నీటిని మరిగించిన తర్వాత వడకట్టాలి. పెరుగుని మజ్జిగలా చేసి ఆ మిశ్రమంలో పోసి కలపాలి. చివరిగా నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం, పుదీనా వేయాలి.
నాస్తా
కావాల్సినవి :
బార్లీ గింజలు, పెరుగు – ఒక్కో కప్పు
నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – సరిపడా
అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి – రెండు
క్యారెట్ తురుము – పావు కప్పు
కొత్తిమీర – కొంచెం, ఆవాలు, జీలకర్ర – ఒక్కోటి అరటీస్పూన్, ఇంగువ – చిటికెడు
నూనె – ఒక టీస్పూన్
తయారీ :
బార్లీ గింజల్ని శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన బార్లీని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో పెరుగు వేయాలి. కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము కూడా వేసి మరోసారి కలపాలి. పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. ఆ పోపును బార్లీ మిశ్రమంలో వేసి కలిపితే సరి.