25 ఏండ్ల దాకా డీలిమిటేషన్​ వద్దు ..జనాభా ప్రాతిపదికన చేపడితే ఒప్పుకోం

25 ఏండ్ల దాకా డీలిమిటేషన్​ వద్దు ..జనాభా ప్రాతిపదికన చేపడితే ఒప్పుకోం
  • చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు.. హద్దులే మార్చాలి
  • ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్​సభలో సౌత్​ వాటా 33% ఉండాల్సిందే
  • కేంద్రానికి తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి
  • దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోం.. ఇప్పటికే నిధులు, పన్ను చెల్లింపుల్లో కోత 
  • రాష్ట్రం రూపాయి ఇస్తే 41 పైసలు మాత్రమే వెనక్కి 
  • అదే యూపీకి 2 రూపాయ‌‌‌‌ల 73 పైస‌‌‌‌లు, బిహార్​కు  9 రూపాయ‌‌‌‌ల 22 పైస‌‌‌‌లు
  • ఉత్తరాదిని గౌరవిస్తం.. కానీ, దక్షిణాది హక్కులపై రాజీపడబోమని వెల్లడి
  • చెన్నైలో ‘ఫెయిర్​ డీలిమిటేషన్’ మొదటి జేఏసీ మీటింగ్​లో ప్రసంగం
  • హాజరైన నాలుగు రాష్ట్రాల సీఎంలు, లీడర్లు 

హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా లోక్‌‌‌‌స‌‌‌‌భ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్​) చేపడ్తే ఊరుకోబోమని, ఇక్కడి ప్రజల భాగస్వామ్యంతో ఐక్యంగా పోరాడుతామని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. ‘‘జ‌‌‌‌నాభా ప్రాతిప‌‌‌‌దికన, ప్రొరేటా విధానంలో లోక్ సభ నియోజకవర్గ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో పెంచొద్దు. అలా పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. దీన్ని సహించేది లేదు. 25 ఏండ్ల పాటు ఎంపీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయొద్దు. డీలిమిటేషన్​ ప్రక్రియ చేపట్టాలనుకుంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా.. రాష్ట్రాల్లోని న‌‌‌‌గ‌‌‌‌రాలు, గ్రామాల్లోని జ‌‌‌‌నాభా ఆధారంగా హ‌‌‌‌ద్దుల‌‌‌‌ను మాత్రమే మార్చాలి” అని డిమాండ్​ చేశారు. శనివారం చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్​ అధ్యక్షతన  ‘ఫెయిర్​ డీలిమిటేషన్’ మొదటి జాయింట్​ యాక్షన్​ కమిటీ మీటింగ్​ జరిగింది. 

దీనికి తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్​, పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ హాజరయ్యారు. వీరితోపాటు తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, వినోద్, జగదీశ్​రెడ్డి అటెండ్​ అయ్యారు. మీటింగ్​లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ప్రతిపాదిస్తున్నట్లు జ‌‌‌‌నాభా దామాషా ప‌‌‌‌ద్ధతిలో డీలిమిటేషన్​ చేప‌‌‌‌డితే ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాలు దేశంలో రాజ‌‌‌‌కీయ గ‌‌‌‌ళం కోల్పోతాయి. మనస్థాయి ద్వితీయ శ్రేణి పౌరులుగా దిగజారుతుంది. అటు ఉత్తరప్రదేశ్‌‌‌‌, బిహార్‌‌‌‌, మ‌‌‌‌ధ్యప్రదేశ్‌‌‌‌, రాజ‌‌‌‌స్థాన్‌‌‌‌, చత్తీస్‌‌‌‌గ‌‌‌‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌‌‌‌త్యం చెలాయిస్తాయి. అందుకే ఎట్టి ప‌‌‌‌రిస్థితుల్లోనూ మ‌‌‌‌నం దీనికి అంగీక‌‌‌‌రించ‌‌‌‌కూడ‌‌‌‌దు” అని స్పష్టం చేశారు. బీజేపీ అనుస‌‌‌‌రిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా ద‌‌‌‌క్షిణాది ప్రజ‌‌‌‌లు, పార్టీలు, నాయ‌‌‌‌కులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.  ‘‘మ‌‌‌‌నది ఒకే దేశం.. ఉత్తరాదిని గౌరవిస్తం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్​ను అస్త్రంగా ప్రయోగించి దక్షిణాదికి నష్టం కలిగిస్తే సహించం” అని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపడితే.. మంచి ప్రగ‌‌‌‌తి సాధిస్తున్న రాష్ట్రాల‌‌‌‌కు శిక్ష వేసినట్లవుతుందని, దీనిపై ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లలో ఎలాంటి మార్పులు చేయొద్దని, ఉన్న సీట్లతోనే పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న ప్రక్రియ చేప‌‌‌‌ట్టాలన్నారు. 

వాజ్​పేయి విధానం పాటించాలి

‘‘ప్రొరేటా విధానం(ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి) ప్రకారం సీట్లు పెంచితే కూడా ద‌‌‌‌క్షిణాదికి న‌‌‌‌ష్టం కలుగుతుంది. ఈ ప్రక్రియ కూడా రాజ‌‌‌‌కీయ అంత‌‌‌‌రాల‌‌‌‌ను పెంచుతుంది..’’ అని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ప్రొరేటా విధానం వల్ల..  ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ సీట్లున్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు పెరుగుతాయన్నారు. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వాలు ప‌‌‌‌డిపోయిన చ‌‌‌‌రిత్ర మ‌‌‌‌న దేశంలో ఉందని, అందువల్ల  ప్రొరేటా విధానం కూడా ద‌‌‌‌క్షిణాది రాజ‌‌‌‌కీయ ప్రయోజ‌‌‌‌నాల‌‌‌‌కు భంగం క‌‌‌‌లిగిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే మాజీ ప్రధాని వాజ్‌‌‌‌పేయి విధానాన్ని మోదీ పాటించాలని, మ‌‌‌‌రో 25 ఏండ్లపాటు  లోక్‌‌‌‌స‌‌‌‌భ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావ‌‌‌‌ద్దని ఆయన సూచించారు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న ప్రక్రియ చేప‌‌‌‌ట్టాలని.. రాష్ట్రాల్లోని న‌‌‌‌గ‌‌‌‌రాలు, గ్రామాల్లోని జ‌‌‌‌నాభా ఆధారంగా లోక్‌‌‌‌స‌‌‌‌భ సీట్ల హ‌‌‌‌ద్దుల‌‌‌‌ను మార్పు చేయాలని సూచించారు. ‘‘1976 లో ఇందిరా గాంధీ నాయకత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం.. ఉన్న సీట్లతోనే పునర్విభజన చేపట్టింది.. 2001లో ప్రధాని వాజ్‌‌‌‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా  సీట్లలో ఎలాంటి మార్పు లేకుండానే  పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న ప్రక్రియ‌‌‌‌ చేసింది. లోక్‌‌‌‌స‌‌‌‌భ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధాని మోదీ ఈ పునర్విభజనను  చేయ‌‌‌‌గ‌‌‌‌ల‌‌‌‌రా..’’ అని ఆయన ప్రశ్నించారు. తాజా జ‌‌‌‌నాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలని, ప్రతి రాష్ట్రంలో మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌కు 33 శాతం రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు క‌‌‌‌ల్పించాలని రేవంత్​ డిమాండ్ చేశారు. 

రాష్ట్రం రూపాయి ఇస్తే  41పైసలు వెనక్కి 

జనాభాను సాకుగా చూపి ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల‌‌‌‌కు నిధుల్లో, పన్ను చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం కోత పెడ్తున్నదని, చివ‌‌‌‌రికి జాతీయ ఆరోగ్య మిష‌‌‌‌న్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాల‌‌‌‌కే 60 నుంచి 65 శాతం నిధులు ఎక్కువగా ఇస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ప్రస్తుతం దేశం అతిపెద్ద స‌‌‌‌వాల్‌‌‌‌ ఎదుర్కొంటున్నది. బీజేపీ జ‌‌‌‌నాభా జ‌‌‌‌రిమానాల విధానాన్ని కొన‌‌‌‌సాగిస్తున్నది.1971లో జ‌‌‌‌నాభాను నియంత్రించాల‌‌‌‌ని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌‌‌‌లు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జ‌‌‌‌నాభా నియంత్రణ‌‌‌‌లో విఫ‌‌‌‌ల‌‌‌‌మ‌‌‌‌య్యాయి. ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల‌‌‌‌న్నీ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించాయి. జీడీపీ, త‌‌‌‌ల‌‌‌‌స‌‌‌‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌‌‌‌ల్పన‌‌‌‌, మెరుగైన మౌలిక వ‌‌‌‌స‌‌‌‌తుల క‌‌‌‌ల్పన‌‌‌‌, సుప‌‌‌‌రిపాల‌‌‌‌న‌‌‌‌, సంక్షేమ కార్యక్రమాల నిర్వహ‌‌‌‌ణ‌‌‌‌లో మంచి ప్రగ‌‌‌‌తిని సాధించాయి. దేశ ఖ‌‌‌‌జానాకు మ‌‌‌‌నం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ త‌‌‌‌క్కువ మొత్తాన్ని పొందుతున్నాం. త‌‌‌‌మిళ‌‌‌‌నాడు ప‌‌‌‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే కేవలం 29 పైస‌‌‌‌లు వెన‌‌‌‌క్కి వ‌‌‌‌స్తున్నాయి. కానీ, ఉత్తర ప్రదేశ్‌‌‌‌  మాత్రం రూపాయికి రెండు రూపాయ‌‌‌‌ల 73 పైస‌‌‌‌లు వెనక్కి తీసుకుంటున్నది. బిహార్‌‌‌‌ ఏకంగా తాను చెల్లించే ప్రతి రూపాయికి 9 రూపాయ‌‌‌‌ల 22 పైస‌‌‌‌లు వెన‌‌‌‌క్కి తీసుకుంటున్నది. అదే క‌‌‌‌ర్నాట‌‌‌‌క‌‌‌‌కు కేవ‌‌‌‌లం 14 పైస‌‌‌‌లు, తెలంగాణ‌‌‌‌కు 41 పైస‌‌‌‌లు, కేర‌‌‌‌ళ‌‌‌‌కు  62 పైస‌‌‌‌లే కేంద్రం వెనక్కి ఇస్తున్నది. మ‌‌‌‌ధ్య ప్రదేశ్  రూపాయి ఇస్తే 2 రూపాయల 79 పైస‌‌‌‌లు తీసుకెళ్తున్నది. ఇది అన్యాయం కాదా?’’ అని ప్రశ్నించారు. 

జనాభా నియంత్రణను పాటించినందుకు శిక్ష వేస్తరా? 

‘‘తెలంగాణ‌‌‌‌లోని మ‌‌‌‌ల్కాజిగిరి ఎంపీగా నేను పనిచేశాను. అది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గం. అక్కడ మొత్తం జ‌‌‌‌నాభా 45 ల‌‌‌‌క్షలైతే ఓట‌‌‌‌ర్లు 32 లక్షలు. అందుకే  ఈ స‌‌‌‌మ‌‌‌‌స్యను నేను పూర్తిగా అర్థం చేసుకోగ‌‌‌‌ల‌‌‌‌ను. పార్లమెంట్.. దేశానికి విధాన‌‌‌‌ప‌‌‌‌ర‌‌‌‌మైన శాస‌‌‌‌నాల‌‌‌‌ను రూపొందిస్తుందే త‌‌‌‌ప్ప ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన చిన్న చిన్న స‌‌‌‌మ‌‌‌‌స్యలపై నిర్ణయాలు చేయ‌‌‌‌దు.  ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు సంబంధించిన ముఖ్యమైన స‌‌‌‌మ‌‌‌‌స్యలు స్థానిక సంస్థలు, రాష్ట్రాలు, శాస‌‌‌‌న‌‌‌‌స‌‌‌‌భ నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గాల ప‌‌‌‌రిధిలోనే ప‌‌‌‌రిష్కారమ‌‌‌‌వుతాయి. అందువల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అవసరంలేదు’’ అని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ‘‘జ‌‌‌‌నాభా నియంత్రణ‌‌‌‌న పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను అభినందించాలి. కానీ, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపట్టి శిక్షిస్తే సహించం. అలాంటి ఆలోచనకు కేంద్రం స్వస్తి చెప్పాలి. దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వ‌‌‌‌ర‌‌‌‌కు 50 ఏండ్లపాటు దక్షిణాది రాష్ట్రాలు అందించిన సేవ‌‌‌‌ల‌‌‌‌కు అభినందించాలి. ఇందుకోసం వెన‌‌‌‌క్కి కొంత చెల్లించాలి” అని అన్నారు. దేశంలోని ఇత‌‌‌‌ర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లను ఏర్పాటు చేసిన‌‌‌‌ట్లే.. ద‌‌‌‌క్షిణాదికి అవ‌‌‌‌కాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. మంచి ప్రగ‌‌‌‌తి సాధించిన ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల‌‌‌‌కు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇత‌‌‌‌ర రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, సుప‌‌‌‌రిపాల‌‌‌‌న‌‌‌‌పై దృష్టి పెట్టేలా చేయాలని ఆయన సూచించారు.

అసెంబ్లీలో తీర్మానం చేస్తం

‘‘ద‌‌‌‌క్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజ‌‌‌‌కీయ పార్టీలు విభేదాల‌‌‌‌ను వీడి, పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న‌‌‌‌లో మ‌‌‌‌న వాటా ద‌‌‌‌క్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలి” అని సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్​ ప్రక్రియ‌‌‌‌పై తమ రాష్ట్ర అసెంబ్లీలో త్వర‌‌‌‌లోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాల్లోనూ చేయాలని స‌‌‌‌హ‌‌‌‌చ‌‌‌‌ర ముఖ్యమంత్రులు, ఇత‌‌‌‌ర నాయ‌‌‌‌కులకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ద‌‌‌‌క్షిణ భార‌‌‌‌త‌‌‌‌దేశ పౌరుల గ‌‌‌‌ళాన్ని బ‌‌‌‌లంగా, ఐక్యంగా మొత్తం దేశానికి వినిపిద్దామని పిలుపునిచ్చారు.

దక్షిణాదికి 33 % వాటా కావాలి  

543 సీట్లు ఉన్న లోక్‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌లో ప్రస్తుతం ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల వాటా 24శాతం (సీట్ల సంఖ్య 130) అని, పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌న త‌‌‌‌ర్వాత ఏర్పడే కొత్త లోక్‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌ సీట్లలో దక్షిణాదికి 33 శాతం వాటా సీట్లు ఇవ్వాల‌‌‌‌ని, ఇదే ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల డిమాండ్‌‌‌‌ అని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. ‘‘కేంద్రంలోని బీజేపీ సర్కార్​ 50 శాతం ఎంపీ సీట్లను పెంచాల‌‌‌‌నుకుంటే.. అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ స‌‌‌‌భ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల‌‌‌‌కు 33 శాతం అంటే..  272 సీట్లు ఇవ్వాలి” అని  కేంద్రానికి సీఎం సూచించారు. ఈ 272 సీట్లను ద‌‌‌‌క్షిణాదిలోని త‌‌‌‌మిళ‌‌‌‌నాడు, క‌‌‌‌ర్నాట‌‌‌‌క‌‌‌‌, కేర‌‌‌‌ళ‌‌‌‌, తెలంగాణ‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌, పుదుచ్చేరికి ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిప‌‌‌‌దిక‌‌‌‌న పంచ‌‌‌‌వ‌‌‌‌చ్చని చెప్పారు. మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇత‌‌‌‌ర రాష్ట్రాల‌‌‌‌కు కేంద్రం త‌‌‌‌మ అభిమ‌‌‌‌తం మేర‌‌‌‌కు పంచ‌‌‌‌వ‌‌‌‌చ్చని, అనుకున్న దానికంటే ద‌‌‌‌క్షిణాది రాష్ట్రాల‌‌‌‌కు సీట్ల సంఖ్య త‌‌‌‌గ్గిస్తే అది దేశ రాజ‌‌‌‌కీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. 

వచ్చే నెలలో హైదరాబాద్​లో సదస్సు

ఫెయిర్​ డీలిమిటేషన్​పై రెండో సదస్సును వచ్చే నెలలో  హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో నిర్వహిద్దామని మీటింగ్​లో సీఎం రేవంత్​రెడ్డి కోరారు. ‘‘మ‌‌‌‌న పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్దామ‌‌‌‌నే విష‌‌‌‌యాన్ని ఆ స‌‌‌‌దస్సులో చ‌‌‌‌ర్చిద్దాం. పునర్విభ‌‌‌‌జ‌‌‌‌న‌‌‌‌తో న‌‌‌‌ష్టపోయే రాష్ట్రాల హ‌‌‌‌క్కుల ర‌‌‌‌క్షణ‌‌‌‌కు భారీ బ‌‌‌‌హిరంగ స‌‌‌‌భ‌‌‌‌ను నేను ఏర్పాటుచేస్త” అని చెప్పారు. ద‌‌‌‌క్షిణ భార‌‌‌‌త‌‌‌‌దేశానికి చెందిన అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లంతా మ‌‌‌‌న హ‌‌‌‌క్కుల ర‌‌‌‌క్షణ‌‌‌‌కు క‌‌‌‌లిసి రావాల‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయిలో స‌‌‌‌మ‌‌‌‌న్వయం, కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ కోసం ఢిల్లీలో కార్యాల‌‌‌‌యం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గాల పున‌‌‌‌ర్విభ‌‌‌‌జ‌‌‌‌నపై అందరినీ ఏక‌‌‌‌తాటిపైకి తెచ్చిన త‌‌‌‌మిళ‌‌‌‌నాడు సీఎం స్టాలిన్‌‌‌‌కు ప్రత్యేక అభినంద‌‌‌‌న‌‌‌‌లు తెలియజేస్తున్నట్లు సీఎం రేవంత్​ పేర్కొన్నారు.