గుడ్​ న్యూస్: బాలింతలకు స్పెషల్​ కిట్

 గుడ్​ న్యూస్: బాలింతలకు  స్పెషల్​ కిట్
  • ప్రభుత్వ హాస్పిటల్స్​లో డెలివరీలు ప్రోత్సహించేందుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం!
  • గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిన కేసీఆర్ కిట్స్​
  • ఆ స్థానంలో మళ్లీ కిట్​ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు
  • సీఎం ​దగ్గరకు ప్రతిపాదనలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. గతంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ పథకం  బీఆర్ఎస్​ హయాంలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని స్థానంలో బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి.. సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.  

గతంలో కేసీఆర్ కిట్  కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు శిశువు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతోపాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్‌లో బేబీ సోప్, ఆయిల్, దుస్తులు, దోమతెరలు, న్యాప్​కిన్స్​ వంటి 16 రకాల వస్తువులు ఉండేవి. అలాగే,  మూడు దశల్లో రూ.12వేల ఆర్థిక సాయం అందేది. ఆడ బిడ్డ పుడితే అదనంగా రూ.వెయ్యి ఇచ్చేవారు. ఈ పథకంతో ప్రభుత్వ హాస్పిటల్స్​లో  ప్రసవాలు పెరగడమే కాకుండా..  శిశు మరణాల రేటు తగ్గింది. అయితే, గత బీఆర్ఎస్​ ప్రభుత్వ సమయంలోనే కేంద్రం ఇచ్చే నిధులకు, రాష్ట్ర వాటా రిలీజ్​ చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది. 

  ఇప్పుడు మళ్లీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ కిట్‌లో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, అలాగే, కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.  

సరికొత్తగా కిట్​​

తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను కొత్త కిట్​లో పెట్టనున్నట్టు తెలుస్తున్నది.  గతంలో కేసీఆర్​ కిట్​లో ఇచ్చిన కొన్ని వస్తువులతోపాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం  బేబీ సోప్, షాంపూ, ఆయిల్ ,  నవజాత శిశువుకు సౌకర్యవంతంగా ఉండేలా 3-–4 జతల బట్టలు, దోమతెర,  న్యాప్​కిన్స్​, డైపర్లు - (నెలకు సరిపడేలా),  శిశువును వెచ్చగా ఉంచేందుకు  బ్లాంకెట్ లేదా చిన్న వస్త్రం,  ప్రసవం తర్వాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్​, పోషకాహార పొడి (తల్లిపాలు సరిపోని పిల్లలకు లాక్టోజన్ లాంటిది),  థర్మామీటర్ , బేబీ టవల్, కాటన్ బడ్స్, చిన్న బాటిల్, శిశువులకు పాలు తాగించడానికి టీట్ ఇచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు.  

దీంతోపాటు ఆర్థిక సాయాన్ని  రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు  పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం  అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఈ ప్రత్యేక కిట్​ స్కీమ్​ను కూడా అమలు చేస్తే..   రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో  ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.