
- ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీలు ప్రోత్సహించేందుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయం!
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిన కేసీఆర్ కిట్స్
- ఆ స్థానంలో మళ్లీ కిట్ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు
- సీఎం దగ్గరకు ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. గతంలో అమల్లో ఉన్న కేసీఆర్ కిట్ పథకం బీఆర్ఎస్ హయాంలోనే నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని స్థానంలో బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
గతంలో కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు శిశువు సంరక్షణ కోసం అవసరమైన వస్తువులతోపాటు ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ కిట్లో బేబీ సోప్, ఆయిల్, దుస్తులు, దోమతెరలు, న్యాప్కిన్స్ వంటి 16 రకాల వస్తువులు ఉండేవి. అలాగే, మూడు దశల్లో రూ.12వేల ఆర్థిక సాయం అందేది. ఆడ బిడ్డ పుడితే అదనంగా రూ.వెయ్యి ఇచ్చేవారు. ఈ పథకంతో ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవాలు పెరగడమే కాకుండా.. శిశు మరణాల రేటు తగ్గింది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలోనే కేంద్రం ఇచ్చే నిధులకు, రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడంతో పథకం నిలిచిపోయింది.
ఇప్పుడు మళ్లీ ఆ స్థానంలో కొత్తగా స్పెషల్ కిట్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ కిట్లో బిడ్డకు, తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, అలాగే, కొంత ఆర్థిక సాయం కూడా అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
సరికొత్తగా కిట్
తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను కొత్త కిట్లో పెట్టనున్నట్టు తెలుస్తున్నది. గతంలో కేసీఆర్ కిట్లో ఇచ్చిన కొన్ని వస్తువులతోపాటు మరికొన్నింటిని కలిపి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పసిబిడ్డ కోసం బేబీ సోప్, షాంపూ, ఆయిల్ , నవజాత శిశువుకు సౌకర్యవంతంగా ఉండేలా 3-–4 జతల బట్టలు, దోమతెర, న్యాప్కిన్స్, డైపర్లు - (నెలకు సరిపడేలా), శిశువును వెచ్చగా ఉంచేందుకు బ్లాంకెట్ లేదా చిన్న వస్త్రం, ప్రసవం తర్వాత తల్లి అవసరాలకు శానిటరీ ప్యాడ్స్, పోషకాహార పొడి (తల్లిపాలు సరిపోని పిల్లలకు లాక్టోజన్ లాంటిది), థర్మామీటర్ , బేబీ టవల్, కాటన్ బడ్స్, చిన్న బాటిల్, శిశువులకు పాలు తాగించడానికి టీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
దీంతోపాటు ఆర్థిక సాయాన్ని రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు పెంచాలని చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఈ ప్రత్యేక కిట్ స్కీమ్ను కూడా అమలు చేస్తే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.