మండుతున్న ఎండలు.. ఏసీలకు ఎంతో గిరాకీ.. నాలుగేళ్లలో సేల్స్ డబుల్..

మండుతున్న ఎండలు.. ఏసీలకు ఎంతో గిరాకీ.. నాలుగేళ్లలో సేల్స్ డబుల్..
  • ​వాతావరణ మార్పులే కారణం

న్యూఢిల్లీ: ‘‘వాతావరణ మార్పుల ఫలితంగా వేడి పెరుగుతోంది. అంతేగాక ప్రజలు సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. అందుకే మనదేశ ఏసీ మార్కెట్ సైజు నాలుగేళ్లలో రెట్టింపు అయింది. కిందటేడాది1.5 కోట్ల ఏసీలు అమ్ముడయ్యాయి” అని ఒక కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తే మనదేశంలో ఏసీలు హాట్​కేకుల్లా అమ్ముడవుతున్నాయని అర్థమవుతోంది. హీటింగ్​, వెంటిలేషన్​, ఏసీ, రిఫ్రిజిరేషన్​(హెచ్​వీఏసీఆర్​) ఇండస్ట్రీ వృద్ధి శరవేగంతో దూసుకెళ్తోంది. గత ఏడాది రెసిడెన్షియల్​ ఏసీ సెగ్మెంట్​సేల్స్​ 35 శాతం పెరిగాయని వోల్టాస్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్ ముకుందన్ ​మీనన్​ వివరించారు. 

నాలుగేళ్ల క్రితం మనదేశంలో ఏడాదికి 70 లక్షల ఏసీలు మాత్రమే అమ్ముడయ్యాయి. మన ప్రభుత్వాలు ఇన్​ఫ్రా కోసం ఎక్కువ ఖర్చు పెడుతుండటం కూడా ఏసీ, ఎయిర్ ​ప్యూరిఫికేషన్​ మార్కెట్​గ్రోత్​కు సాయపడుతోంది. ఏసీల వంటి వైట్​గూడ్స్​ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రూ.6,700 కోట్ల విలువైన ప్రొడక్షన్​ లింక్డ్‌ ఇన్సెంటివ్​(పీఎల్​ఐ) స్కీమును నిర్వహిస్తోంది. ఈ మొత్తంలో రూ.5,700 కోట్లను ఇది వరకే కంపెనీలకు చెల్లించింది. పీఎల్ఐ  స్కీము వల్ల ఏసీ కంపెనీలు దిగుమతులను తగ్గించుకొని, మనదేశంలో ఉత్పత్తిని పెంచాయి. 

ఎక్స్​పర్టులు ఏమంటున్నారంటే...

సత్వ గ్రూప్​ డైరెక్టర్​మహేశ్​ ఖైతాన్ ​మాట్లాడుతూ కమర్షియల్​, రియల్​ఎస్టేట్ ఎదుగుదల కూడా ఏసీల అమ్మకాలకు కారణమని చెప్పారు. ఏటా 10 కోట్ల చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. నగరాల విస్తరణ వల్ల ఆధునిక హెచ్​వీఏసీ సొల్యూషన్స్​కు డిమాండ్​ పెరుగుతోందని, వాతావరణ మార్పులు ఇందుకు కారణమవుతున్నాయని వివరించారు. మేకిన్​  ఇండియా వల్ల మనదేశంలో క్వాలిటీ ప్రొడక్టులు తయారవుతున్నాయని, మనం ఇంటర్నేషనల్​ మార్కెట్​తో పోటీ పడగలుగుతున్నామని చెప్పారు. ‘‘2070 నాటికి నెట్​జీరో కార్బన్స్‌ గోల్ సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 

దీంతో పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు డిమాండ్​ పెరుగుతోంది. ఇంధన పొదుపు విషయంలో టెక్నాలజీ, డిజిటల్ ​సొల్యూషన్స్​, రియల్​ టైం డేటా ఎనలిటిక్స్​ కీలక పాత్ర  పోషిస్తాయ” అని జాన్సన్స్​కంట్రోల్​ ప్రెసిడెంట్, ఎండీ అరుణ్​ అవస్థీ చెప్పారు. స్మార్ట్​, కనెక్టెడ్​, క్లైమైట్​కంట్రోల్ ​సొల్యూషన్స్​ భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయని ఇన్ఫార్మా మార్కెట్​ ఎండీ యోగేశ్​ ముద్రాస్​ చెప్పారు. ఈ సెక్టార్​ వృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వార్షిక వృద్ధి 16 శాతం వరకు ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇన్వర్టర్​ ఏసీలకు, డక్ట్​లెస్​ సిస్టమ్స్​కు డిమాండ్​పెరగడం ఈ గ్రోత్​కు కారణమని వివరించారు.