
సంగారెడ్డి టౌన్, వెలుగు : దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి, పే స్కేల్ అమలు చేయాలని పంచాయతీ టెక్నికల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిబాబ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్లో సిబ్బందితో కలిసి శాంతియుత సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లకు పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని
పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలను తమకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అలివేణి, ఉపాధ్యక్షుడు ప్రభువు, కోశాధికారి శ్రీనివాస్ , రవి , సంతోశ్, ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాల్గొన్నారు.
మెదక్ : తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మెదక్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సమ్మె నిర్వహించారు. తమకు పే స్కేల్ అమలు చేసి ట్రెజరీ ద్వారా వేతనం చెల్లించాలని, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.