
- వైరా గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ను తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
- బోధన తీరు, మెస్ నిర్వహణపై ఆరా...
వైరా, వెలుగు : ఖమ్మం జిల్లా వైరాలోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తనిఖీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి స్టూడెంట్లతో మాట్లాడారు. రాత్రివేళ హాస్టల్లో డ్యూటీలో ఎవరు ఉంటారు ? డిన్నర్ టైమింగ్స్ ఏంటి ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? ఇంటర్ రిజల్ట్ ఎలా వస్తుంది ? స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా క్లాస్రూమ్స్ ఉన్నాయా ? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఒక్కో స్టూడెంట్ను పిలిచి వారు భవిష్యత్లో ఎటువైపు వెళ్లాలనుకుంటున్నారు ? వారి తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితిని అడిగారు. తర్వాత స్టూడెంట్లతో కలిసి అక్కడే భోజనం చేశారు. ప్రతి రోజు మెనూ పాటిస్తున్నారా, భోజనం క్వాలిటీ ఎలా ఉంది ? అని స్టూడెంట్లను ప్రశ్నించారు. మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారో తెలుసుకొని, దాని వద్దకు వెళ్లి చార్ట్ను పరిశీలించారు. అలాగే స్కూల్లో వసతులు, సమస్యలు, స్టాఫ్ వివరాలను సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. వీటిని వినియోగించుకొని బాలికలు ఉన్నతంగా ఎదగాలని సూచించారు.