
- బీఆర్ఎస్ నేతలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలుసు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలకు సరైన సమయంలో స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఇలాంటి విమర్శలకు తాము ఎప్పుడు.. ఎలా.. కౌంటర్ ఇవ్వాలో తెలుసన్నారు. బడ్జెట్పై చర్చలో పాల్గొన్న హరీశ్ రావు రాజకీయ విమర్శలు చేయడం తప్ప అసలు విషయంపై మాట్లాడలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టే హరీశ్రావుకు సభలో మాట్లాడేందుకు 2 గంటల సమయం ఇచ్చామన్నారు. ఆయనకు ఇచ్చిన సమయాన్ని సభలో మాట్లాడేందుకు సద్వినియోగం చేసుకొని ఉంటే బాగుండేదన్నారు. బడ్జెట్పైనే హరీశ్ మాట్లాడుతారని ఆశించామని, అయితే, ఆయన అసలు సబ్జెక్టు మాట్లాడకుండా సభను పక్కదారి పట్టించేలా వ్యవహరించడం విచారకరమని పేర్కొన్నారు.