బడ్జెట్​లో జర్నలిస్టుల సంక్షేమానికి ఫండ్స్ కేటాయిస్తం  : డిప్యూటీ సీఎం భట్టి

బడ్జెట్​లో జర్నలిస్టుల సంక్షేమానికి ఫండ్స్ కేటాయిస్తం  : డిప్యూటీ సీఎం భట్టి
  • ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారంపై ఆలోచిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్ లో తగిన నిధులు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇండ్ల స్థలాల సమస్యను ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనేదానిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే-టీడబ్ల్యూజేఎఫ్ ) 2025 డైరీని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్ లు  జర్నలిస్టుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా  జర్నలిస్టుల హెల్త్ కార్డులు పనిచేయడం లేదని చెప్పారు. వారి కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీంలో జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను కలిపి అన్ని హాస్పిటల్స్ లో  ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రిడేటెడ్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్టులందరికీ జీవిత బీమా అమలు చేయాలని కోరారు.

ఏదేని కారణంతో జర్నలిస్టు చనిపోతే.. వారి కుటుంబాలకు పరిహారం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అందేలా స్కీమ్  తీసుకురావాలన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం.. జర్నలిస్టుల ఆరోగ్య బీమా , జీవిత బీమా, హెల్త్  కార్డులపై  తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుని ఇంటి దగ్గర రెండు మూడు నెలలు రెస్ట్ లో ఉండే జర్నలిస్టులకూ కుటుంబ పోషణ కోసం ఆర్థిక సహకారం అందించే విషయమై పరిశీలన చేస్తామన్నారు.

ఇండ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ బట్టిపాటి రాజ శేఖర్, నాయకులు రామకృష్ణ, చిట్యాల మధుకర్, క్రాంతి, ప్రశాంత్, కొడవటి నవీన్, సీనియర్ జర్నలిస్టులు యాదగిరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.