ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమేంది? : భట్టి విక్రమార్క

ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమేంది? : భట్టి విక్రమార్క
  • ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం : భట్టి విక్రమార్క
  • సెస్, సర్ చార్జీలు మొత్తం కేంద్రానికేనా.. 
  • సహకార సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?
  • రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందే
  • దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్‌‌లో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాలన్నీ కలిసే యూనియన్ అనే సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు లభించే హక్కులను హరిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా రాష్ట్రాలకు అన్యాయం చేయడమే కాకుండా వాటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నదని, ఇది అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అన్నారు. గురువారం తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కాంక్లేవ్​లో భట్టి మాట్లాడారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆర్థిక సంబంధాలు టెక్నికల్ అంశం మాత్రమే కాదని, సమానత్వం, స్వయంప్రతిపత్తి, సమర్ధత సూత్రాల ప్రాతిపదికన రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడమని అన్నారు. 

ఈ సూత్రాలను పాటించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఫెడరల్ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు విఘాతం కలిగిస్తున్నదని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటున్నదని, అంతిమంగా రాష్ట్రాల మధ్య అనైక్యతకు, అసమానతకు కారణమవుతున్నదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలో బలంగా ఉండాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రమని, రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్.. కేంద్ర అధికారాలను పరిమితం చేశారని డిప్యూటీ సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని నొక్కిచెప్పారు. అది విఫలమైతే రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడానికి దారితీస్తుందని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రాల ఆర్థిక అధికారాలను కేంద్రం కబ్జా చేయడంతో అవసరమైనన్ని నిధుల్లేక అభివృద్ధకి ఆటంకం ఏర్పడుతున్నదని వివరించారు. 

వాస్తవ నిధులు రాష్ట్రాలకు అందుతలే..

కేంద్రానికి రాష్ట్రాలు వసూలు చేసి ఇస్తున్న పన్నుల్లో 13వ ఫైనాన్స్ కమిషన్ సమయానికి 32% మాత్రమే రాష్ట్రాలకు పన్నుల వాటాలో అందేవని, 14వ ఆర్థిక సంఘం దీన్ని 42%కి పెంచడంతో కాస్త వెసులుబాటు లభించిందని భట్టి అన్నారు. కానీ, పూర్తి స్థాయిలో న్యాయం లభించలేదని, ఆ 10% పెంపుతో వాస్తవ నిధుల వరద రాష్ట్రాలకు అందట్లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌‌‌‌‌‌‌‌, సర్‌‌‌‌‌‌‌‌చార్జీల పేరుతో వసూళ్లు చేయడమే ఇందుకు కారణమని

ఇలా సమకూరిన ఆదాయంలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండట్లేద ని, మొత్తం కేంద్రానికే పోతున్నాయని చెప్పారు. దేశం మొత్తం జీడీపీలో ఈ రూపంలో అందుతున్న ఆదాయం దాదాపు 28% అని పేర్కొన్నారు. సెస్, సర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు తాత్కాలికమేనని కేంద్రం చెప్తున్నా మరో రూపంలో ఏటా శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తూ ఉన్నదన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు కోత

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపులోనూ కేంద్రం తాత్సారం చేస్తున్నదని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూపొందించుకున్న అంచనాలకు అనుగుణంగా సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సంకటం ఏర్పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా రీత్యా 19% ఉన్నప్పటికీ మొత్తం జీడీపీలో 30% వాటాను అందిస్తున్నాయని

 కానీ, డివొల్యూషన్ ద్వారా 21% (11వ ఆర్థిక సంఘం) అందితే 15వ ఆర్థిక సంఘం నాటికి 15.8% మాత్రమే అందుతున్నదన్నారు. జనాభా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు ప్రోత్సాహం లభించడానికి బదులుగా ఆర్థిక నిధుల విడుదలకు జనాభా లెక్కలను (2011నాటి) ప్రామాణికంగా తీసుకోవడంతో కోత పడినట్లయిందన్నారు.

రాష్ట్రాలపై ఇన్ని కండిషన్లు పెట్టుడేంది?

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాలకు ఇస్తున్న నిధులకు దేశమంతా ఒకే ఫార్ములాను రూపొందించడంతో రాష్ట్రాల్లోని ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడంలో చిక్కులు వస్తున్నాయని భట్టి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఇస్తున్న రూ. 4.80 లక్షల కోట్లలో ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు అందే నిధులు మూడోవంతు (రూ. 1.32 లక్షల కోట్లు)గానే ఉన్నాయన్నారు. ఇంకోవైపు రాష్ట్రాలు తీసుకునే అప్పుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకుని పరిమితుల ఆంక్షలు విధిస్తున్నదని, కానీ కేంద్రం మాత్రం యధేచ్ఛగా అప్పులు తీసుకుంటున్నదన్నారు. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియకు కూడా 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటున్నందున జనాభా నియంత్రణ (ఫ్యామిలీ ప్లానింగ్)ను సమర్ధంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి పార్లమెంటులో గొంతు వినిపించలేని పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానించారు. 

పన్నుల వాటా 50శాతానికి పెంచాలి 

వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50% అందాలని భట్టి డిమాండ్ చేశారు. జీడీపీలో ఆయా రాష్ట్రాల కంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌కు తగిన నిష్పత్తి ప్రకా రం ఇవ్వాలని, కేంద్రం ప్రస్తుతం వసూలు చేస్తున్న సెస్, సర్‌‌‌‌‌‌‌‌చార్జీల విషయంలో రాష్ట్రాలకూ వాటా ఇచ్చే లా మార్పులు జరగాలని అన్నారు. రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్ర పరిమితులను ఎత్తివేసి స్వయంప్రతిపత్తి కల్పించాలని

నియోజకవర్గాల డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌లో దక్షిణాది రాష్ట్రాలకు పొలిటికల్ వాయిస్ ఉండేలా నిబంధనలను, గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ మార్చాలని, ఆర్థిక అంశాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని అక్షరాలా కేంద్రం అమలు చేయాలని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో 16వ ఆర్థిక సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ కాంక్లేవ్‌‌‌‌‌‌‌‌లో చేసిన తీర్మానాన్ని పంపాలన్న నిర్ణయం జరిగింది.