బుద్ధిమాంద్యం, అజ్ఞానం ..హరీశ్ వ్యాఖ్యలపై భట్టి తీవ్ర అభ్యంతరం

బుద్ధిమాంద్యం, అజ్ఞానం ..హరీశ్ వ్యాఖ్యలపై భట్టి తీవ్ర అభ్యంతరం
  • సభానాయకుడిని అవమానిస్తున్నారు
  • సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • వాటిని వెనక్కి తీసుకోవాలన్న సభాపతి 
  • వాళ్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో నే రోడ్లేశారు
  •  కమీషన్లు రావనే బీఆర్ఎస్ హయాంలో రోడ్లు వేయలే
  • రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •  మా వికారాబాద్ లో రోడ్లు సక్కగ లేక పిల్లనిస్తలె: స్పీకర్
  • కృష్ణా జలాలపై చర్చవద్దు.. నీళ్లకు నీళ్లు  పాలకు పాలు చర్చిద్దాం
  • శాసన సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: బుద్ధి మాంధ్యం, అజ్ఞానం అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతోందని అన్నారు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారని చెప్పారు.  ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో మాంద్యం ఉందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్‌, రిజిస్ట్రేషన్‌ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్‌ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు. తెలంగాణ రైజింగ్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్  కుమార్ జోక్యం చేసుకొని బుద్ధి మాంధ్యం అనే పదాన్ని వాడటం కరెక్టు కాదని, దానిని ఉపసంహరించుకోవాలని, అలా మాట్లాడటం సభ హూందా తనాన్ని తగ్గిస్తుందని చెప్పారు. 

దీనికి హరీశ్ రావు స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి గారు బట్టలూడదీసి కొడ్తం అని ఇదే సభలో అంటే వారికి మీరెందుకు చెప్పలేదు’ అని ప్రశ్నించారు. ‘నేను బుద్ధి మాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పుందీ’ అన్న.. అని అన్నారు. అది తప్పయితదా...? వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.! అన్నారు.. హరీశ్ రావు సభలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా అజ్ఞానం వల్ల అన్నారు. అంటే సీఎంకు జ్ఞానం లేదనా..? మాకెవరికీ జ్ఞానం లేదనా ..? అంటూ ప్రశ్నించారు. సభానాయకుడిని పట్టుకొని మాట్లాడే మాటలు కరెక్టేనా..? అన్నారు. 

ALSO READ | తాగునీటి సమస్య రానివ్వం.. తప్పుడు ప్రచారం మానుకోవాలె.. బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క సీరియస్

బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతుంటే స్పీకర్ గారు చెప్తా ఉంటే సభాపతి గారితోనూ వాదనకు దిగుతున్నారు.’ భాష వాడేటప్పులు పరిధి దాటి మాట్లాడొద్దు అన్నారు. ఇదే సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో  రోడ్లు వేయలేదని,  కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్లకే వేసుకున్నారని అన్నారు.  కమీషన్లు రావలనే తమ జిల్లాలకు రోడ్లు వేయలేదని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుంటూ.. ‘మా వికారాబాద్  జిల్లాలో రోడ్లు సక్కగ లేక పిల్లనిచ్చేటట్టు లేరు’ అని అన్నారు. హరీశ్ రావు కృష్ణ జలాల అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని నీళ్లకు నీళు.. పాలకు పాలు తర్వాత చర్చిద్దామని అన్నారు.