అడవులను నరకలే.. జంతువులను చంపలే: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్

అడవులను నరకలే.. జంతువులను చంపలే: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూను ఉద్దేశించి ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గురించి ప్రధాని మోడీ ఎందుకు అలా మాట్లాడారో మాకు తెలియదు. కానీ కంచ గచ్చిబౌలి భూముల్లో మేం చెట్లను నరకలేదు.. జంతువులను చంపలేదని క్లారిటీ ఇచ్చారు. 

అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని.. వాస్తవాలను కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలో అటవీ భూమి లేదని.. ఆ భూముల్లో వివిధ సంస్థలు ఉన్నాయన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడారని నిలదీశారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని.. వాస్తవాలను మేం కోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేయకండని హితవు పలికారు. 

అంతకుముందు హర్యానాలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందంటూ కంచ గచ్చిబౌలి  భూములనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ  వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ.