- వాటిని తీసుకొచ్చేందుకుకృషి చేయండి
- రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 15 వేల కోట్ల నిధులు వచ్చేలా కృషిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క దిశానిర్దేశం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్ లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.5.50 లక్షల కోట్లు రావాల్సి ఉందని, అందులో తెలంగాణకు రావాల్సిన వాటా నిధులు రూ. 15 వేల కోట్లు ఉన్నాయని వివరించారు.
శుక్రవారం అందుబాటులో ఉన్న ఎంపీలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య, పట్టణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ పనులు, నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన బుక్లెట్లను వారికి అందజేశారు.
సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురామిరెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, అనిల్కుమార్ యాదవ్, కడియం కావ్యతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.