
- ఎస్ఎల్బీసీలోని ఐదో పంపు ఏర్పాటు పనులు పూర్తి చేయాలి
- సీతారామతో పాలేరు రిజర్వాయర్ను నింపుతం
- డిండి కింద చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేయాలి
- ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ శాఖ ప్రీ బడ్జెట్ మీటింగ్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీని ప్రాధాన్యంగా తీసుకుని, ఏఎంఆర్పీలోని ఐదో పంప్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పూర్తిగా స్టడీ చేసి గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్ను నింపే పనులను స్పీడప్ చేస్తామన్నారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ నుంచి సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం ఏదుల కాలువలను పూర్తి చేయాలన్నారు. సోమవారం సెక్రటేరియెట్లో ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు.
డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని మంత్రులు ఆదేశించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహణ, క్యాపిటల్ వర్క్స్ పై దృష్టి సారించాలని ఆదేశించారు.
గత పదేండ్లలో ఒక్క కాళేశ్వరంపైనే దృష్టి
గతంలో పదేండ్ల పాటు పాలించిన వాళ్లు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించి.. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేశారని భట్టి, ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టుల గేట్ల రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువల బలోపేతం పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వం అడ్డగోలు వడ్డీ రేట్లకు అప్పులు తేవడంతో ఆ భారం ప్రస్తుత ఖజానా నిర్వహణపై పడుతున్నదని తెలిపారు.
10% వడ్డీకి అప్పులు తెచ్చారని, దానిని 8 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గృహ జ్యోతి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఈ పథకం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవా లని మంత్రులు సూచిం చారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరి గేషన్ శాఖ సలహాదా రు ఆదిత్య దాస్, ఆర్థి క శాఖ ప్రిన్సిపల్ సెక్ర టరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సెక్ర టరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ జన రల్ అనిల్, ఈఎన్సీఓ అండ్ ఎం విజయ భా స్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.