
- గత సర్కారు పెండింగ్ పెట్టిన బిల్లులూ చెల్లించాం: మంత్రి పొన్నం
- మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు
హైదరాబాద్, వెలుగు: గత సర్కార్ పాల్పడిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీములను కొనసాగిస్తున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు పెండింగ్ పెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ బిల్లులను కూడా తామే చెల్లించామని స్పష్టం చేశారు.
శాసన మండలి సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నకు సమాధానంగా పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. కల్యాణమస్తు పథకాన్ని అమలు చేయకుండా మహిళలను కాంగ్రెస్ సర్కారు మోసగించిందని కవిత అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టారు. మేం వచ్చాక వాటిని చెల్లించాం. అయినా కల్యాణమస్తు కింద తులం బంగారం ఎక్కడ అని అడుగుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కవితకు తెలుసు. అందువల్ల రాష్ట్ర ఆదాయం పెంచే మార్గం కూడా ఆమె చెప్తే బాగుంటుంది’ అని అన్నారు. కాగా, మండలిలో సోమవారం వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు.
డీజిల్ బస్సులు సిటీ బయటకు: భట్టి
బల్మూరి వెంకట్, మహేశ్కుమార్ గౌడ్లు అడిగిన ప్రశ్నలకు గారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం సోలార్ పవర్ను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ‘‘రాష్ట్రంలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తున్నం. సోలార్, విండ్, పంపుడ్ వాటర్ హైడ్రో పవర్, బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరులపై దృష్టి పెట్టాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు 1,000 మెగావాట్లు ఉత్పదకత చేసేలా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అమలు చేస్తం. యువతకు కూడా సోలార్ విద్యుత్ ఉత్పాదకత అవకాశాలు కల్పిస్తం” అని వెల్లడించారు. హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. డీజిల్తో నడిచే ఆర్టీసి బస్సులను సిటీ బయటకు పంపిస్తున్నామని అన్నారు.