తెలంగాణ జాబ్స్ స్పెషల్ : హైదరాబాద్​పై దాడి.. పోలీసు​ చర్యే

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : హైదరాబాద్​పై దాడి.. పోలీసు​ చర్యే

1948 ఆగస్టులో మౌంట్​ బాటన్​ భారత్​ గవర్నర్​ జనరల్​ పదవి నుంచి తప్పుకొని బ్రిటన్ కు వెళ్లిపోయాడు. అప్పుడు రాజగోపాలాచారి భారతదేశ గవర్నర్​ జనరల్​గా నియామకమయ్యారు. తక్షణమే వల్లభాయ్​ పటేల్​ రాజాజీని కలసి హైదరాబాద్​ భారతదేశంలో విలీనం కావాలంటే సైనిక దాడి చేయాల్సిందేనని పరిస్థితులను వివరించారు. రాజాజీ జవహర్​లాల్​నెహ్రూను రాష్ట్రపతి భవన్​కు పిలిపించి హైదరాబాద్​ను భారతదేశంలో విలీనం చేయడానికి సైనిక చర్య తప్పదని వివరించాడు. ఇందుకు నెహ్రూ సుముఖత వ్యక్తం చేశాడు. హైదరాబాద్​పై దాడిని సైనిక చర్య అనకూడదని, ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి పోలీస్​ చర్యగా పరిగణించాలని రాజాజీ పేర్కొన్నారు. ‘పోలీస్​ యాక్షన్​’ అనే పేరుతోనే గతంలో ఇ.ఎన్​.గొడార్డ్​ రూపొందించిన సైనికదాడి వ్యూహం ప్రకారం దాడులు జరగాలని నిర్ణయించారు. 

గొడార్డ్​ ప్రణాళిక రచన 

ఆపరేషన్​ పోలోను సైనిక రహస్య పత్రాల్లో ఆపరేషన్​ కాటర్​ పిల్లర్​గా పేర్కొంటారు. భారత సైన్యం హైదరాబాద్​లోకి ప్రవేశించి హైదరాబాద్​ సంస్థానంలోని పోలో గ్రౌండ్స్​ను తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఆపరేషన్​ పోలో అని పేరు వచ్చింది. ఈ సమయంలో ప్రధాన సైన్యాధిపతిగా సర్​ రాయ్​ బౌచర్​, రక్షణ మంత్రిగా బల్దేవ్​సింగ్​ వ్యవహరిస్తున్నారు. గొడార్డ్​ ప్రణాళిక ప్రకారం హైదరాబాద్​పై దాడి చేయడానికి నిర్ణయించిన భారత ప్రభుత్వం ఈ దాడి ప్రణాళికను అమలు చేసే బాధ్యత అప్పటి దక్షిణ కమాండ్​ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ రాజేంద్రసింగ్​జి జడేజాకు అప్పగించింది. తక్షణమే రాజేంద్రసింగ్​జీ జడేజా సైన్యాన్ని మూడు యూనిట్లుగా విభజించి వాటిని షోలాపూర్​, విజయవాడ, బీరార్​/ హోస్పేటకు పంపాడు. యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడం కోసం పుణె ఎయిర్​బేస్​ను ఉపయోగించారు. జెఎన్​ చౌదరి నాయకత్వం వహిస్తున్న షోలాపూర్ దళంలో స్ట్రెకింగ్​ ఫోర్స్​, స్మాష్​ ఫోర్స్​, కిల్​ ఫోర్స్​, వీర్​ ఫోర్స్​ ఉన్నాయి. ఎ.ఎ.రుద్ర నాయకత్వం వహిస్తున్న విజయవాడ దళంలో 17వ పునా హార్స్​, క్వీన్​ విక్టోరియా దళాలు, శివదత్తుసింగ్​ నాయకత్వం వహిస్తున్న బీరార్​/ హోస్పేట దళంలో 1వ మైసూర్​ ఆర్మీ, 5/5 గుర్ఖా రైఫిల్స్​ సేనలు ఉన్నాయి. 

నలుదిక్కుల నుంచి దాడులు 

సెప్టెంబర్​ 13న షోలాపూర్​ నుంచి బయల్దేరిన జెఎన్​ చౌదరి నాయకత్వంలోని సైనికదళం మొదటగా మహారాష్ట్రలోని నల్​దుర్గ్​ వద్ద నిజాం సైన్యాన్ని ఎదుర్కొంది. కెప్టెన్​ రామ్​సింగ్​ నల్​దుర్గ్​ను ఆక్రమించాడు. అదే సమయంలో ఔరంగాబాద్​ ఆక్రమణకు కెప్టెన్​ డీఎస్​ బ్రార్​ పంపారు. ఇతను హైదరాబాద్​ సైన్యం, రజాకార్లను ఓడించి ఔరంగాబాద్​ను ఆక్రమించాడు. విజయవాడ నుంచి బయల్దేరిన ఎ.ఎ.రుద్ర దళం మునగాలను ఆక్రమించుకుంది. శివదత్తు దళం హోస్పేటను తమ ఆధీనంలోకి తీసుకుని ఉస్మానాబాద్​ వైపు బయల్దేరాడు. సెప్టెంబర్​ 14న కెప్టెన్​ రామ్​సింగ్ రాజసూర్​ ప్రాంతాన్ని ఆక్రమించి ముందుకు కదిలాడు. అప్పుడే హైదరాబాద్​ సైన్యం వెనక్కి కదులుతూ అనేక బ్రిడ్జిలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో పుణె ఎయిర్​బేస్​ నుంచి ఎయిర్​ మార్షల్​ ముఖర్జీ నాయకత్వంలో హాకర్​  ఎయిర్​క్రాప్ట్​లు హైదరాబాద్​ సంస్థానంలోకి ప్రవేశించి నిజాం సైన్యం, రజాకార్ల స్థావరాలపై దాడి చేశాయి. దీని తర్వాత భారత సైన్యం సునాయసంగా హైదరాబాద్​ వైపు వెళ్లింది. 

లొంగిపోయిన నిజాం 

కెప్టెన్​ రామ్​సింగ్​ జల్నా, లాతూర్​, బీదర్​, జహీరాబాద్​లను, ఎ.ఎ.రుద్ర కోదాడ, సూర్యాపేట, నార్కట్​పల్లి, చిట్యాలను, శివదత్తు దళం ఉస్మానాబాద్​ను ఆక్రమించుకుని హైదరాబాద్​ వైపు కదిలాయి. సెప్టెంబర్​ 17 నాటికి భారత సైన్యం హైదరాబాద్​లోకి ప్రవేశించింది. దీంతో మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ లేక్​వ్యూ గెస్ట్​హౌస్​లో ఉన్న కె.ఎం.మున్షీని కలిసి యుద్ధ విరమణ గురించి చర్చించారు. 1948 సెప్టెంబర్​ 17న  సాయంత్రం 5గంటలకు ఉస్మాన్ అలీఖాన్​ దక్కన్​ రేడియోలో మాట్లాడుతూ హైదరాబాద్​ భారతదేశంలో అంతర్భాగమైందని, హైదరాబాద్​ ప్రజలు ఎవరూ భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయొద్దని ప్రకటించాడు. ఉస్మాన్ అలీఖాన్​ రేడియో ప్రకటనతో భారతదేశ సైనిక దాడి పూర్తిగా నిలిచిపోయింది. ఉస్మాన్​ అలీఖాన్​  ప్రధాని పదవి నుంచి లాయక్​ అలీని తొలగించి ఒక కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్​కు చేరుకున్న జెఎన్​ చౌదరి ఉస్మాన్​ అలీఖాన్​ కొత్త మంత్రివర్గం చెల్లదని, ఇక భారత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కొత్త మంత్రివర్గం ఏర్పడుతుందని ప్రకటించారు. ఆ విధంగా 1947 సెప్టెంబర్​ 17న నిజాం పాలన అంతమై హైదరాబాద్​ భారత యూనియన్​లో విలీనమైంది. అప్పటి హైదరాబాద్​ సైన్యాధిపతి సయ్యద్​ అహ్మద్​ ఎడ్రూస్​ తన మొత్తం సైన్యంతో భారత సైన్యానికి లొంగిపోయాడు. రజాకార్​ నాయకుడు ఖాసిం రజ్వీని అరెస్టు చేసి పుణెలోని ఎర్రవాడ జైలుకు తరలించారు. జెఎన్​ చౌదరి హైదరాబాద్​ మిలిటరీ గవర్నర్​గా నియామకమయ్యారు. 1948 సెప్టెంబర్​ 22న ఉస్మాన్​ అలీఖాన్​ ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. 1948 సెప్టెంబర్​ 17ను మహారాష్ట్రలో మరఠ్వాడ సంగ్రామ్​ ముక్తి దివస్​ అని, కర్ణాటకలో హైదరాబాద్​–కర్ణాటక విభజన దినోత్సవంగా నిర్వహిస్తారు. తెలంగాణలో కొంత మంది విద్రోహ దినం/ బ్లాక్​ డే మరికొందరు విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు.

ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు

భారత సైనిక దాడుల కదలికను తెలుసుకున్న ఉస్మాన్​ అలీఖాన్​ తక్షణమే మెహదీ నవాజ్​జంగ్​ ద్వారా 1948 సెప్టెంబర్​ 10న భారత ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై 1948 సెప్టెంబర్​ 13న భద్రతా మండలిలో చర్చకు వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం అదేరోజు సెప్టెంబర్​ 10న ఉస్మాన్​ అలీఖాన్​కు మూడు రోజులు గడువు ఇస్తూ కె.ఎం.మున్షీతో చివరి హెచ్చరిక జారీ చేసింది. కాని ఉస్మాన్​ అలీఖాన్​ ఈ దాడిని ఐక్యరాజ్య సమితి అడ్డుకుంటుందని మున్షీ చేసిన హెచ్చరికను పట్టించుకోలేదు. 1948 సెప్టెంబర్​ 12న అర్ధరాత్రి 12గంటల లోపు నిజాం నుంచి స్పందన లేకపోతే సైనిక దాడి చేయాల్సిందిగా భారత సైన్యానికి భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నిజాం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో 1948 సెప్టెంబర్​ 13 తెల్లవారుజామున 4 గంటలకు అన్ని వైపుల నుంచి (విజయవాడ, షోలాపూర్​, బీరార్​/ హోస్పేట) ఏక కాలంలో భారత సైనిక దాడులు ప్రారంభమయ్యాయి.  

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 562 సంస్థానాలు ఉండేవి. వీటిలో కశ్మీర్​, జునాగఢ్​, ట్రావెన్​కోర్​, హైదరాబాద్​ మినహాయించి మిగతావన్నీ భారత్​ లేదా పాకిస్తాన్​లో విలీనమయ్యాయి. 1947 జూన్​ 12న ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ తాను సర్వస్వతంత్రుడునని ప్రకటించుకొన్నాడు. దీంతో అప్పటి ఉప ప్రధాని వల్లభాయ్​ పటేల్​ హైదరాబాద్​ సంస్థానాన్ని ఒక రాచపుండుగా భావించి దాన్ని తక్షణమే తొలగించాలని పేర్కొన్నాడు. హైదరాబాద్​పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి దక్షిణ కమాండ్​ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ ఇ.ఎన్​.గోర్డన్​ను పటేల్​ ఆదేశించాడు. కానీ గవర్నర్​ జనరల్​ మౌంట్​ బాటన్​ హైదరాబాద్​పై సైనిక దాడి జరగకుండా అడ్డుకున్నారు.