పార్టీ కోసం కష్ట పడ్డ వారికే పదవులు

పార్టీ కోసం కష్ట పడ్డ వారికే పదవులు

కొత్తకోట, వెలుగు: పార్టీని నమ్ముకుని కష్ట పడ్డ ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్​ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని బీపీఆర్​ గార్డెన్​లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే సమక్షంలో సీడీసీ చైర్మన్ గా గొల్లబాబు(చంద్రశేఖర్​ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జీఎమ్మార్​ మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో గొల్లబాబు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా  కాంగ్రెస్​ గెలుపు కోసం తనవంతు కృషి చేశారని తెలిపారు. 

ఆయన పార్టీకి చేసిన  సేవలు గుర్తించి సీడీసీ చైర్మెన్​ పదవి అప్పజెప్పిందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. వారు చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కోట్లు కడుతూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్​ నేతలకు  అభివృద్ధితో సమాధానం చెబుతున్నామని చెప్పారు. మార్కెట్​ చైర్మన్​ పల్లెపాగ ప్రశాంత్, పార్టీ నేతలు బీచుపల్లి యాదవ్, శ్రీనివాసులు, సాగర్, వేముల శ్రీనివాస్​ రెడ్డి, బోయేజ్, ఎల్లంపల్లి నరేందర్, రాములు పాల్గొన్నారు.