
పెద్దపల్లి, వెలుగు: కాకా కుటుంబంతోనే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరిగిందని, రానున్న కాలంలో కాకా మనుమడు గడ్డం వంశీకృష్ణ తోనే మళ్లీ నియోజకవర్గం డెవలప్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ బాలసాని సతీశ్ ఆదివారం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి, ఆయన కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి హయాంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.
విశాక ట్రస్ట్ ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేయించారని, స్కూళ్లకు బెంచీలు, ఇతర వస్తువులను అందజేసిన ఘనత వివేక్ వెంకటస్వామి కుటుంబానిదని పేర్కొన్నారు. అలాంటి కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వంశీకృష్ణ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.