పర్యాటకంలో పెట్టుబడిదారులకు ప్రత్యేక రాయితీలు.. పీపీపీ విధానంలో అభివృద్ధి: మంత్రి జూపల్లి

పర్యాటకంలో పెట్టుబడిదారులకు ప్రత్యేక రాయితీలు.. పీపీపీ విధానంలో అభివృద్ధి: మంత్రి జూపల్లి

తెలంగాణలో పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు, రూ.15 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్షిప్ (పీపీపీ) విధానం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని,  పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా   పెట్టుబడిదారులకు  మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. గురువారం (ఏప్రిల్ 10) ముంబయి పోవై లేక్ లో జ‌రిగిన‌ ద‌క్షిణాసియా 20వ హోట‌ల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ప్రఖ్యాత హోట‌ల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధుల‌తో ప్రత్యేకంగా స‌మావేశ‌మై తెలంగాణ ఆతిధ్య రంగంలో పెట్టుబ‌డులు పెట్టి ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న ప‌ర్యాట‌క విధానంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆతిధ్య రంగంలో  అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఏర్పడింద‌ని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణ‌ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో,  హెరిటేజ్, మెడికల్,  వెల్ నెస్ టూరిజంను అభివృద్ధి చేసేలా నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందించామ‌ని వివ‌రించారు.   రాష్ట్రంలో 2030 నాటికి  రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలనే ఆశ‌యంతో ప‌ని చేస్తున్నట్లు చెప్పారు.