సింగిల్ ప్యాకేజీలో ‘అమృత్​’ పనులు

సింగిల్ ప్యాకేజీలో ‘అమృత్​’ పనులు
  • పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు

మోత్కూరు, వెలుగు : అమృత్ స్కీంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సింగిల్ ప్యాకేజీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అమృత్ స్కీంలో రూ.12 కోట్లతో నిర్మిస్తున్న మంచినీటి ట్యాంకులు, టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్ రూ.10 కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిట్యాల, నేరేడుచర్ల మినహా మిగతా 17 మున్సిపాలిటీలు, ఖమ్మంలోని 9 మున్సిపాలిటీల్లో అమృత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయాల్సి ఉందని, ఈ పనుల కోసం రూ.1768 కోట్ల ఫండ్స్ కేటాయించారని తెలిపారు. 

వచ్చే రెండేళ్లలో ఈ పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉందన్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కాలేజీ, హైస్కూల్ ఆవరణలో భారీ ట్యాంకులు నిర్మించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు పనులన్నీ నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ డీఈఈ మనోహర, ఏఈ సురేశ్ ఉన్నారు.