
ముంబై: 2029లో కూడా మోడీనే భారత ప్రధానిగా ఉంటారని.. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయ పర్యటనపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం కీలక నేత, ఎంపీ సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ప్రకారం 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలి. ఈ సెప్టెంబర్లో ప్రధాని మోడీకి 75 ఏండ్లు పూర్తి అవుతాయి.
ఈ క్రమంలోనే సెప్టెంబర్లో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం గురించి చర్చించేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి ఉండొచ్చని.. త్వరలోనే మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి’’ అని సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పదవి విరమణ గురించి మాట్లాడేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చాడన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీ ఇప్పట్లో రిటైర్ కారని.. ఇంకా చాలా సంవత్సరాలు దేశాన్ని పాలిస్తారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 2029లో మనం మళ్ళీ మోడీని ప్రధానమంత్రిగా చూస్తామని.. ఇప్పుడే ఆయన వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఆయన మా నాయకుడని.. భవిష్యత్లోనూ ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. తండ్రి జీవించి ఉన్నప్పుడు వారసత్వం గురించి మాట్లాడటం మన హిందు సంస్కృతిలో కరెక్ట్ కాదని.. అది మొఘల్ సంస్కృతి అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. మోడీ రిటైర్మెంట్ గురించి చర్చించాల్సిన సమయం ఇంకా రాలేదని సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు సీఎం ఫడ్నవీస్.
మోడీ వారసుడి ఊహాగానాలపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ భయ్యాజీ జోషి కూడా స్పందించారు. ఈ ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. మోడీ వారసుడి ఎంపికపై ఆర్ఎస్ఎస్ కసరత్తు చేస్తోందన్న వాదనను ఖండించారు. ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయ పర్యటనలో.. మోడీ రిటైర్మెంట్, అతడి ప్రత్యామ్నాయం గురించి ఎటువంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర నుంచే మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేస్తుందన్న ప్రచారంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.
కాగా, ప్రధాని మోడీ పీఎం హోదాలో తొలిసారి 2025, మార్చి 30న మహారాష్ట్ర నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్కు ఆయన నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహా వృక్షమని అభివర్ణించారు. అలాగే.. నాగ్పూర్లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.