అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

అక్టోబర్ 3 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కొండపై ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) ఆలయంలో ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో భాస్కర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఈవో విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు నిర్వహించే నవరాత్రి పూజల్లో పాల్గొనే భక్తుల కోసం పలు రకాల టికెట్లను సైతం దేవస్థానం అందుబాటులో తెచ్చింది.

నవరాత్రి పూజల్లో పాల్గొనడానికి టికెట్ ధర రూ.1,116 గా నిర్ణయించారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఒక్కరోజు సప్తశతి పారాయణం పూజ కోసం రూ.116, ఒక్కరోజు లక్షకుంకుమార్చన కోసం రూ.116 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 12 వరకు భక్తులతో నిత్యం నిర్వహించబడే రుద్రహోమం పూజను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈవో
 వెల్లడించారు.