ఖైరతాబాద్ గణేశ్​లడ్డూ ప్రసాదం కోసం పోటీపడ్డ భక్తులు

ఖైరతాబాద్ గణేశ్​లడ్డూ ప్రసాదం కోసం పోటీపడ్డ భక్తులు

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లోని ఖైరతాబాద్ బడా గణేశ్​కు సోమవారం ఎనిమిదో రోజు పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు భారీ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.   సిటీలోని లంగర్ హౌస్​కు చెందిన శ్రీకాంత్ అందించిన 2,200 కిలోల లడ్డూను కమిటీ సభ్యులు పంపిణీ  చేశారు. అయితే, ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎలాగైనా పొందాలని భక్తులు పోటీ పడ్డారు.  క్యూలైన్లలో ఉన్నవారు కూడా ప్రసాదం కోసం పరుగులు తీశారు.  

ఉదయం నుంచి సాయంత్రం వరకు లడ్డూ పంపిణీ జరిగింది.  భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో  ఖైరతాబాద్‌‌‌‌ చౌరస్తా, సోమాజిగూడ, లక్డీకాపూల్,  టెలిఫోన్‌‌‌‌ భవన్‌‌‌‌, ఎన్టీఆర్ మార్గ్​పై ట్రాఫిక్‌‌‌‌జామ్‌‌‌‌ అయింది.  వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, సినీ నటుడు సుధీర్ బాబు, హీరో కిరణ్ అబ్బవరం బడా గణేశ్​ను దర్శించుకున్నారు.

ఆర్ఎస్ఎస్​ ఘోష్  ప్రదర్శన..

బడా గణేశ్ మండపం వద్ద సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆర్ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ స్వయం సేవకులు ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. ఘోష్ వాదన అందరినీ ఆకట్టుకుంది.  కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత, విభాగ్ అధికారులు పాల్గొన్నారు.