
జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న మహాశివరాత్రి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున నుంచి గట్టు మల్లన్న స్వామి, వేలాల గ్రామంలోని మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల టైమ్పట్టింది. భక్తిశ్రద్ధలతో మల్లికార్జునస్వామిని కొలిచి ఉపవాస దీక్షలు ఆచరించారు. ఉపవాసాలతో బోనాలు పోసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి–-సరోజ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పోతరాజుల, లక్ష్మిదేవరల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు సుమారు లక్షకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని ఆలయ ఈఓ రమేశ్తెలిపారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ అధ్వర్యంలో శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ సహా 20 మంది సీఐలు, 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.