
జగదేవపూర్, వెలుగు: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ వద్ద వెలసిన కొండపోచమ్మ దగ్గరకు వచ్చి దర్శనం కోసం బారులు తీరారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు కొమురవెల్లి నుంచి కొండపోచమ్మకు భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయ్యాయి.
ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈఓ మోహన్ రెడ్డి, సర్పంచ్ రజిత, ఆలయం వద్ద ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.